అసభ్యతపై తాజా కష్టాల్లో షారూక్: సైఫ్ ఆస్తుల జప్తు
ముంబై/ భోపాల్: మూడేళ్ల క్రితం వాంఖేడే స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా అసభ్యకరంగా మాట్లాడిన కేసులో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్పై కేసు నమోదు చేయాలని బాలల సంఘం ముంబై పోలీసులను ఆదేశించింది. 2012 మే 16న ఘటనలో పిల్లల ముందు మాట్లాడకూడని పదజాలం వాడినందుకు బాలల హక్కుల చట్టాల కింద కేసు పెట్టాలని సూచించింది.
నాటి నుంచి షారుక్, ఆయన భార్యపై కేసు నమోదు చేయకపోవడంపై విచారణ జరపాలని కూడా ఆదేశించింది. ఈ కేసులో ముంబై క్రికెట్ అసోసియేషన్ షారుక్కు వాంఖేడే స్టేడియంలోకి ఐదేళ్ల పాటు ప్రవేశాన్ని నిషేధించింది. పిల్లల ముందు అసభ్యంగా మాట్లాడడం వల్ల వారు మానసిక క్షోభకు గురవుతారని ఆరోపించారు.
బాలీవుడ్ ‘ఛోటే నవాబ్' సైఫ్ అలీఖాన్ ఆస్తులపై కేం ద్ర హోంశాఖ నిఘా పెట్టింది. సైఫ్ అలీఖాన్కు వారసత్వంగా సంక్రమించిన ఆస్తిపై ‘ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్'(శత్రువుల ఆస్తి చట్టం) కింద విచారణ చేపట్టింది. ఈ మేరకు భారత్లోని శత్రువుల ఆస్తి సంరక్షక కార్యాలయం మధ్యప్రదేశ్ రెవెన్యూ శాఖకు లేఖ రాసింది. రాష్ట్రంలో పాక్, చైనా దేశీయుల ఆస్తులపూర్తి వివరాలివ్వాలని తెలిపింది.
ఈ ఆస్తుల్లో సైఫ్ అలీఖాన్ ముత్తాత భోపాల్ నవాబు హమీదుల్లా ఖాన్ ఆస్తులూ ఉన్నట్లు సమాచారం ఇచ్చింది. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం భోపాల్లోని కుటుంబ ఆస్తుల వివరాలివ్వాలని సైఫ్కు నోటీసులిచ్చింది. భోపాల్ సింహాసనం నుంచి అబీదా సుల్తాన్ బేగంకు సంక్రమించిన ఆస్తిని నవాబు హమీదుల్లా ఖాన్ బహదూర్కు అప్పగించి కొడుకుతో పాటు పాక్కు వలస వెళ్లారు.
దీంతో ఈ ఆస్తి కూడా 1965 ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ కిందకే వస్తుందని కేంద్రం పేర్కొంది. దీని ప్రకారం ఛోటా నవాబ్ ఆస్తులన్నీ తక్షణమే జప్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది.