కరోనా బాధితుల కోసం ఐసీయూగా షారూక్ ఖాన్ ఆఫీస్ సిద్ధం .. దాతృత్వం చాటుకున్న రియల్ హీరో
కరోనా సమయంలో చాలా మంది హీరోలు తమ ఉదారతను చాటుకుంటున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కూడా ఒకరు . ముంబైలోని తన కార్యాలయాన్ని కరోనా బాధితుల కోసం ఐసీయూగా మార్చటానికి ఇచ్చిన ఆయన తన ఔదార్యాన్ని చాటుకున్నారు . ఇప్పటికే చాలా మంది సినీ నటులు , ప్రముఖులు తమ వంతు సాయం అందించారు. అక్షయ్ కుమార్ , సోనూ సూద్ వంటి వారు కరోనా కష్టకాలంలో చాలా మందిని ఆదుకున్నారు .
ముంబై ఖార్లోని తన కార్యాలయాన్ని కరోనా రోగుల కోసం ఇచ్చిన షారూఖ్ ఖాన్
షారుఖ్ ఖాన్ తన స్టార్డమ్ను సరైన విషయాల కోసం ఉపయోగించుకోవటానికి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు . బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న షారూఖ్ ఖాన్ అవసరమైన వారికి సహాయం చెయ్యటంలోనూ ముందే ఉన్నారు . ఏప్రిల్లో, సూపర్స్టార్ ముంబైలోని ఖార్లోని తన కార్యాలయాన్ని బిఎమ్సికి కరోనా మహమ్మారి సమయంలో బాధితుల కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. అప్పటి నుండి కరోనా బాధితులకు ఐసోలేషన్ సెంటర్ గా దానిని వినియోగిస్తున్నారు .
షారూఖ్ కార్యాలయం ఐసియుగా అప్గ్రేడ్ .. 15 పడకలతో సిద్ధం
జూలై 15 నుండి, ముంబైలోని షారూఖ్ ఖాన్ కార్యాలయాన్ని ఐసియుగా అప్గ్రేడ్ చేసే పని ప్రారంభమైంది. అంతకుముందు 66 మంది రోగులను అక్కడ చేర్చారు, వారిలో 54 మంది కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఐసియు సదుపాయానికి అప్గ్రేడ్ చేయాల్సిన స్థితిలో 12 మంది రోగులను ఇతర ఆస్పత్రులకు బదిలీ చేయాల్సి వచ్చింది. షారూఖ్ ఖాన్ యొక్క మీర్ ఫౌండేషన్, ఖార్లోని హిందూజా హాస్పిటల్ మరియు బిఎమ్సి సహకారంతో 15 పడకల సౌకర్యంతో ఐసీయూ సిద్ధం అయింది .
Recommended Video
రీల్ హీరో కాదు రియల్ హీరో అని షారూఖ్ కు ప్రశంసలు
ఖార్ లోని హిందుజ హాస్పిటల్ డాక్టర్ అవినాష్ సుపే మాట్లాడుతూ, " వెంటిలేటర్లు, ఆక్సిజన్ లైన్లతో, క్లిష్టమైన రోగులకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నదని తెలిపారు. లిక్విడ్ ఆక్సిజన్ నిల్వ ట్యాంకులను కలిగి ఉందని ఈ సేవను హిందూజా హాస్పిటల్ మార్గదర్శకత్వంలో నిర్వహిస్తుందని పేర్కొన్నారు . ఈ ఐసీయూను ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో హిందూజ ఆసుపత్రి నిర్వహిస్తోందని ఆయన పేర్కొన్నారు . షారూక్ ఖాన్ తీసుకున్న ఈ నిర్ణయంతో రీల్ హీరోనే కాదు ఆయన రియల్ హీరో అని కొనియాడుతున్నారు షారూఖ్ ఫ్యాన్స్ .