షారుక్ ఖాన్పై రాందేవ్ ఆగ్రహం, స్టార్కు శివసేన అండ
ముంబై: యోగా గురువు రామ్ దేవ్ బాబా బాలీవుడ్ అగ్రహీరో షారుక్ ఖాన్ పైన గురువారం తీవ్రంగా మండిపడ్డారు. భారత్లో మత అసహనం పెరిగిపోతుందన్న షారుక్ ఖాన్ వ్యాఖ్యల్లో అర్థం లేదన్నారు. మత అసహనంపై షారుక్ నిజంగానే ఆందోళన చెందితే ఆయన తీసుకున్న పద్మశ్రీ వెనక్కి ఇచ్చేయాలన్నారు.
పద్మశ్రీ అవార్డుతో పాటు తీసుకున్న నగదు బహుమతిని కూడా వెనక్కి ఇచ్చేయాలని రామ్ దేవ్ బాబా డిమాండ్ చేశారు. షారుక్ నిరసన తెలపాలని భావిస్తే అవార్డును వెనక్కి ఇచ్చేయడంతో పాటు బహుమతిగా వచ్చిన డబ్బును ప్రధాని సహాయ నిధికి జమ చేయాలని సూచించారు.
షారుక్ ఖాన్కు శివసేన దన్ను
షారుక్ ఖాన్ పైన పలువురు బిజెపి నేతలు మండిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన ఓ ప్రకటన విడుదల చేసింది. ఒక ముస్లిం అయినందున షారుక్ ఖాన్ పైన తీవ్ర విమర్శలు, ఆరోపణలు సరికాదని శివసేన వ్యాఖ్యానించింది.
బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు బుధవారం షారుక్ పైన విమర్శలు చేసిన నేపథ్యంలో శివసేన స్పందించడం గమనార్హం. బిజెపి నేత కైలాశ్ విజయ్ వర్గియా.. షారుక్ భాష, పాకిస్తాన్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ భాష ఒక్కటే అన్నారు.
ఆ వ్యాఖ్యలను ఆయన ఆ తర్వాత వెనక్కి తీసుకున్నారు. బిజెపి ఎంపీ యోగి ఆదిత్యనాథ్ కూడా తీవ్ర విమర్శలు చేశారు. అయితే, బిజెపి మాత్రం నేతల వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని తెలిపింది. నేతలు అదుపులో ఉండాలని సూచించింది.