టైమ్ మ్యాగజైన్ టాప్100 ప్రభావశీలుర జాబితా- సీఏఏ నిరసనల్లో పాల్గొన్న బిల్కీస్కు చోటు
దేశవ్యాప్తంగా ప్రతీ ఏటా వివిధ రంగాల్లో ప్రజలను ప్రభావితం చేసిన వంద మంది జాబితాను ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రకటిస్తుంది. ఇందులో పలు రంగాల్లో ఎక్కువ మందిని ప్రభావితం చేసిన వారికి చోటు దక్కుతుంది. తాజాగా 2020 ఏడాది కోసం టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన టాప్ 100 ప్రభావశీలుర జాబితాలో ఓ పేరు సంచలనం రేపుతోంది.
గతేడాది కేంద్రం తీసుకొస్తున్న సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్లో 82 ఏళ్ల బిల్కీస్ దాదీ పాల్గొన్నారు. ఆమె ప్రతికూల వాతావరణ పరిస్ధితుల్లోనూ, పోలీసుల ఆంక్షల మధ్య నిరంతరాయంగా షహీన్ ప్రాంతంలో నిరసనల్లో పాల్గొన్నారు. పోలీసుల తూటాలు దూసుకొస్తున్న చలించకుండా ఆమె షహీన్ బాగ్లో మరికొందరితో కలిసి నిరసనలు కొనసాగించారు. ఒకప్పుడు మేం బ్రిటీషర్లను తరిమికొట్టాం, ఇప్పుడు వచ్చి మోడీ, అమిత్షా మేం దురాక్రమణదారులం అంటున్నారు. అసలు వీరెవరు అంటూ ఆమె వేసిన ప్రశ్నలు అప్పట్లో సంచలనం అయ్యాయి.
సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీ షహీన్ బాగ్ లో 82 ఏళ్ల బిల్కీస్ చేపట్టిన నిరసనలు దేశంలో వేలాది మంది విద్యార్ధులు, యువతను ప్రభావితం చేశాయి. వీరిలో చాలా మంది నేరుగా ఆమెను కలిసి సంఘీభావం కూడా ప్రకటించారు. దీంతో ఇప్పుడు టైమ్ మ్యాగజైన్ గత ఏడాది కాలంలో ఎక్కువ మందిని ప్రభావితం చేసిన వారి జాబితాలో బిల్కీస్ను చేర్చింది.