నో పర్మిషన్: అమిత్ షాను కలిసేందుకు షహీన్బాగ్ ఆందోళనకారులకు అనుమతి నిరాకరణ..
పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి సందేహాలుంటే తనను కలువాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల తెలిపారు. దీంతో షహీన్బాగ్ నుంచి వేలాది మందిని అమిత్ షాను కలిసేందుకు ఆయన ఇంటికొచ్చారు. అయితే అమిత్ షాను కలిసేందుకు పోలీసులు మాత్రం అనుమతించలేదు. దీంతో వారు వెనుదిరగాల్సి వచ్చింది.
అమిత్ షాను కలిసేందుకు శనివారం మధ్యాహ్నమే షహీన్బాగ్ నిరసనకారులు పోలీసులను అనుమతి కోరారు. ఢిల్లీ జిల్లా అధికారులను కోరితే.. వారు పోలీసులకు పంపించారు. భద్రతా కారణాల దృష్ట్యా పర్మిషన్ ఇవ్వలేదు. గత రెండు నెలల నుంచి సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ను నిరసిస్తూ షహీన్బాగ్లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
సీఏఏపై సందేహాలుంటే తనను నేరుగా కలువాలని అమిత్ షా పేర్కొనడంతో.. ఈ మేరకు నిరసనకారులు కలిసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. దాదాపు 5 వేల మంది రావడంతో వారితో అమిత్ షా చర్చలు జరపడం వీలుకాదని భద్రతా సిబ్బంది పేర్కొన్నారు. సమస్యను విన్నవించేందుకు కొందరినీ రావాలని కోరగా.. తామంతా చర్చలు జరుపుతామని సమాధానం ఇచ్చారు. కొందరితో చర్చలు జరిపేందుకు తాము వ్యతిరేకమని అమిత్ షాకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
గత రెండు నెలలుగా సీఏఏపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసనలు ఉద్రిక్తతకు దారితీయడంతో పదుల సంఖ్యలో చనిపోయారు. ఒక్క యూపీలోనే 11 మంది వరకు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.