షాహీన్బాగ్ షూటర్కు ఆమ్ ఆద్మీతో లింకులు.. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సంచలన స్టేట్మెంట్
Recommended Video
ఈ నెల 8వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ప్రధాన పోటీ ఆమ్ ఆద్మీ పార్టీ,బీజేపీ మధ్యే నెలకొనగా.. షాహీన్బాగ్ అంశం ఎన్నికల ప్రచారంలో ప్రధానాస్త్రంగా మారింది. షాహీన్బాగ్ అంశాన్ని బీజేపీ పదేపదే ఆమ్ ఆద్మీ పార్టీపై గురిపెడుతోంది. ఇలాంటి తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ ఇచ్చేలా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటీవల షాహీన్బాగ్లో సీఏఏ నిరసనకారులపై కాల్పులు జరిపిన కపిల్ గుజ్జర్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవాడని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు.
ఖండించిన ఆమ్ ఆద్మీ
2019 ప్రారంభంలో కపిల్ గుజ్జర్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరినట్టు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెప్పారు. కపిల్ గుజ్జర్ పలువురు ఆమ్ ఆద్మీ సీనియర్ నేతలతో దిగిన ఫోటోలను అతని సెల్ఫోన్ నుంచి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఆమ్ ఆద్మీలో చేరిన విషయాన్ని విచారణలో కపిల్ కూడా అంగీకరించారని క్రైమ్ బ్రాంచ్ డీసీపీ రాజేశ్ డియో తెలిపారు. కపిల్తో పాటు అతని తండ్రి కూడా ఆమ్ ఆద్మీలో చేరినట్టు తెలిపారు.
ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న ఆమ్ ఆద్మీ
ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం పోలీసుల వ్యాఖ్యలను ఖండించింది. కపిల్ గుజ్జర్కు,తమ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో.. విచారణ పూర్తికాని ఓ కేసులోకి తమ పార్టీని లాగడం సరికాదని ఆమ్ ఆద్మీ నేత సంజయ్ సింగ్ అన్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
క్రైమ్ బ్రాంచ్పై ఆమ్ ఆద్మీ ఫైర్
బుధవారం క్రైమ్ బ్రాంచ్ డీసీపీ రాజేశ్ డియోకి లీగల్ నోటీసులు పంపించనున్నట్టు సంజయ్ సింగ్ తెలిపారు. ఎవరి అనుమతితో ఆ కేసులోకి తమ పార్టీ పేరును లాగారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. రాజేష్ డియో బీజేపీ అధికార ప్రతినిధి అని,పొరపాటున క్రైమ్ బ్రాంచ్ డీసీపీ అయి తప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. షాహీన్బాగ్ కాల్పుల నిందితుడు తమ పార్టీ సభ్యుడు అవునో కాదో.. తాము అంతర్గత విచారణ చేపడుతామని చెప్పారు.
క్రైమ్ బ్రాంచ్ వాదనను ఖండించిన కపిల్ ఫ్యామిలీ
కపిల్ గుజ్జర్,అతని తండ్రి ఆమ్ ఆద్మీలో చేరారన్న ప్రచారాన్ని వారి కుటుంబ సభ్యులు కూడా ఖండించారు. ఇది తప్పుడు ప్రచారం అన్నారు. కపిల్ గుజ్జర్ అంకుల్ ఫతే సింగ్ మాట్లాడుతూ.. పోలీసులు చెబుతున్న ఫోటోలు ఎక్కడినుంచి వచ్చాయో అర్థం కావడం లేదన్నారు. కపిల్కు ఏ రాజకీయ పార్టీతో గానీ,రాజకీయ కుటుంబంతో గానీ సంబంధం లేదన్నారు. కపిల్ తండ్రి గజే సింగ్ 2008 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరుపున పోటీ చేసి ఓడిపోయారన్నారు. అప్పటినుంచి మరే పార్టీలో చేరలేదని చెప్పారు.