మరో జలియన్వాలా బాగ్ విషాదమేనా: షాహీన్బాగ్లో ఏం జరగబోతోంది..ఓవైసీ చెబుతున్నదేమిటి..?
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల తర్వాత షాహీన్బాగ్ జలియన్వాలా బాగ్లా తయారువుతుందనే అనుమానం కలుగుతోందన్నారు మజ్లిస్ నేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా షాహీన్బాగ్లో గత 50 రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 8 తర్వాత అంటే ఢిల్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగిన అనంతరం షాహీన్బాగ్ నిరసనకారులను ప్రభుత్వం క్లియర్ చేసేందుకు ప్రణాళిక రచించిందనే సమాచారం ఉందని ఓవైసీ చెప్పుకొచ్చారు.
షాహీన్బాగ్లో పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతుండగా అక్కడి నిరసనకారులను చెదరగొట్టే క్రమంలో కాల్పులు కూడా జరిపే అవకాశం ఉందని ఓవైసీ అన్నారు. ఇలా జరిగితే మరో జలియన్వాలా బాగ్ను షాహీన్బాగ్ తలపిస్తుందని చెప్పారు. ఇది కచ్చితంగా జరిగి తీరుతుందనే అనుమానం బలంగా ఉందన్నారు అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పటికే ఓ కేంద్రమంత్రి బుల్లెట్లు దించాలనే వ్యాఖ్యలు చేశారని ఈ హింసను ప్రోత్సహించేందుకు వ్యూహం రచిస్తున్నదెవరో బయటపెట్టాలని అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు.
2024 వరకు ఎన్ఆర్సీ అమలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని ఓవైసీ డిమాండ్ చేశారు. ఎన్పీఆర్ మీద రూ.3900 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ఓవైసీ ప్రశ్నించారు. తను హిస్టరీ స్టూడెంట్ అని చరిత్రలో ఇలాంటివి జరిగాయని చెప్పుకొచ్చిన ఓవైసీ... హిట్లర్ ఉదంతం గురించి వివరించారు. జర్మనీ నియంత హిట్లర్ కూడా రెండు సార్లు జనాభాపై సర్వే చేయించి అనంతరం యూదులను గ్యాస్ ఛాంబర్లోకి తోసేసి ప్రాణాలు తీసిన మూర్ఖుడని ఓవైసీ అన్నారు. మన దేశం ఆ పరిస్థితుల్లోకి వెళ్లకూడదనేదే తాను చెబుతున్నట్లు ఓవైసీ అన్నారు.
జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో సీఏఏకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు చేపడుతుంటే ఒక వ్యక్తి కన్ను కోల్పోగా మరి కొందరు విద్యార్థులపై పోలీసులు దాడి చేశారనే విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ప్రభుత్వం దాడులు ఎక్కువయ్యాయని ఓవైసీ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీపై ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. జామియా, షాహీన్బాగ్లలో కాల్పులకు తెగబడినవారే ఉగ్రవాదులని అసాదుద్దీన్ ఓవైసీ అన్నారు.