‘షాహీ ఇమామ్కు వారసుడ్ని ప్రకటించే హక్కు లేదు’
న్యూఢిల్లీ: జామా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ తన కొడుకును వారసుడిగా ప్రకటించడం చట్టబద్దం కాదని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం పేర్కొంది. అయితే శనివారం బుఖారీ తన వారసుడిని ప్రకటించే కార్యక్రమంపై మాత్రం స్టే విధించేందుకు కోర్టు నిరాకరించింది.
ఈ కార్యక్రమం చట్టబద్దం కాదని ప్రధాన న్యాయమూర్తి జి రోహిణి, జస్టిస్ ఆర్ఎస్ ఎండ్లాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇమామ్కు అనుకూలంగా ప్రత్యేక పద్ధతులు ఏమి ఉండవని తెలిపింది. అంతేగాకుండా బుఖారీ తన కొడుకును నాయిబ్ ఇమామ్గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన మూడు పిల్స్ను విచారించిన కోర్టు.. కేంద్రప్రభుత్వం, వక్ఫ్బోర్డ్, బుఖారీలకు నోటీసులు పంపింది.
ఇప్పటి వరకు బుఖారీపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని బోర్డును కోర్టు ప్రశ్నించింది. కాగా, గురువారం కోర్టులో మూడు పిటిషన్లపై విచారణ జరుగుతున్న సమయంలో కేంద్రం, వక్ఫ్ బోర్డ్లు బుఖారీ తన కొడుకును వారసుడిగా ప్రకటించడానికి చట్టబద్ద లేదని తెలిపాయి. ఈ విషయంపై తర్వలోనే సమావేశం నిర్వహించి బుఖారీపై చర్య తీసుకుంటామని బోర్డ్ తెలిపింది.
కొత్త ఇమామ్ను ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ షాహిల్ అహ్మద్ ఖాన్, అజయ్ గౌతమ్, న్యాయవాది వికె ఆనంద్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జామా మసీదు వక్ఫ్ బోర్డ్ ఆస్తి అని, ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న బుఖారీ తన కొడుకును వారసుడిగా ఎలా ప్రకటిస్తారని వారు తమ పిటిషన్లో ప్రశ్నించారు.
కాగా, జామా మాసీదు వక్ఫ్ బోర్డు ఆస్తి అని, దీనికి కొత్త షాహీ ఇమామ్లను ప్రకటించే అధికారం వక్ఫ్ బోర్డుకే ఉందని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇది ఇలా ఉండగా జామా మాసీదును చారిత్రాత్మక కట్టడంగా గుర్తించాలని, దానికి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని అర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కోరింది.
షాహీ ఇమామ్ అక్టోబర్ 30న తన 19ఏళ్ల కొడుకును తర్వాత షాహీ ఇమామ్గా, తన వారసుడిగా ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని నవంబర్ 22న నిర్వహించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు.