నా భర్తకు ఐఎస్ఐఎస్తో లింక్: టెక్కీ భార్య
ముంబై: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద గ్రూపుతో ముంబైకి చెందిన ముద్దబిర్ ముస్తాక్ షైక్ (34)కు దగ్గరి సంబంధాలు ఉన్నాయని అతని భార్య షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలుసని ఆమె అంటున్నది.
ముస్తాక్ నిత్యం తాను ఇక్కడ ఉండలేనని, తాను సిరియాకు వెలుతానని చెప్పేవాడని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. మహారాష్ట్రలోని ముంబ్రా పట్టణానికి చెందిన ముస్తాక్ ను శుక్రవారం వేకువ జామున జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ముస్తాక్ భార్య ఉజ్మా (30) బీకాం వరకు చదువుకున్నారు. ఉజ్మా తండ్రి మహమ్మద్ మియాన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పని చేస్తున్నాడు. ఉజ్మా మీడియాకు వివరాలు వెల్లడించారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద భావజాలాన్ని అనుసరిస్తున్న ముస్తాక్ కు తాము ఎన్నో సార్లు వారించి కౌన్సింగ్ నిర్వహించామని ఉజ్మా అంటున్నది.
మనకు ఇద్దరు పిల్లలు, కుటుంబం ఉందని ఎన్ని సార్లు చెప్పినా ముస్తాక్ మాట వినలేదని, కనీసం పట్టించుకోలేదని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇస్లామిక్ స్టేట్ లో తాను ఒక భాగమని, ఐఎస్ఐఎస్ మంచి కోసం పని చేస్తున్నదంటూ చెప్పి ముస్తాక్ తప్పించుకునే వాడని ఉజ్మా చెప్పింది.
అమృతనగరలోని రేష్మా అపార్ట్ మెంట్ లోని తన ఇంటిలో నా భర్త ముస్తాక్ తో కలిసి ఉండలేక బయటకు వచ్చి బంధువుల దగ్గర నివాసం ఉంటున్నానని ఉజ్మా వివరించారు. భారత్ లో ఐఎస్ఐఎస్ నియామకాలు చేపడుతున్న వారిలో ముస్తాక్ ప్రధాన నిందితుడు అని ఎన్ఐఏ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
టెక్కీ అయిన ముస్తాక్ ను శుక్రవారం ముంబైలోని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండ్ పొందామని అధికారులు చెప్పారు. సోమవారం ముస్తాక్ ను ఢిల్లీలోని పాటియాల కోర్టులో హాజరుపరిచామని ఎన్ఐఏ అధికారులు వివరించారు.