ఆర్బీఐ గవర్నర్ కేంద్రంతో నిర్మొహమాటంగా ఆ మాట చెప్పాలి... చిదంబరం కీలక వ్యాఖ్యలు
ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలపై మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం ట్విట్టర్ ద్వారా స్పందించారు.ఓవైపు 2020-21 వృద్ది రేటు నెగటివ్లోకి వెళ్తుంటే.. ఆర్బీఐ మరింత ద్రవ్య లభ్యతను ఎందుకు సమకూరుస్తోందని ప్రశ్నించారు. 'మార్కెట్లో డిమాండ్ పడిపోయిందని ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ చెబుతున్నారు. వృద్ది రేటు కూడా తిరోగమనంలోఉందన్నారు. అలాంటప్పుడు ద్రవ్య లభ్యతను ఎందుకు పెంచుతున్నట్టు..?' అని ప్రశ్నించారు.
20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ బ్లాంక్ పేజీ, మోడీ ఆర్థిక ఉద్దీపనపై చిదంబరం సెటైర్లు..
శక్తి కాంత దాస్ ఇప్పటికైనా ఆర్బీఐలో కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని నిలువరించాలని చెప్పారు. 'మీ పని మీరు చేయండి.. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే చర్యలు తీసుకోండి.' అని నిర్మొహమాటంగా కేంద్రానికి చెప్పాలని సూచించారు. ఓవైపు దేశ జీడీపీ క్షీణిస్తోందని ఆర్బీఐ గవర్నర్ చెబుతున్నారని.. కానీ మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీడీపీలో 1శాతం కూడా లేని ప్యాకేజీని పట్టుకుని గొప్పలు పోతున్నారని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థను పతనం చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని చూసి ఆర్ఎస్ఎస్ సిగ్గుపడాలన్నారు.
కాగా,శుక్రవారం ఆర్బీఐ రెపో రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రెపో రేటును 4 శాతానికి, రివర్స్ రెపో రేటును 3.35 శాతానికి కుదించింది. గత మూడు నెలల్లో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించడం ఇది మూడోసారి. ఈ నిర్ణయంతో గృహ, వాహన, ఇతర రుణాలతో పాటు సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది.
టర్మ్ లోన్లపై మారటోరియంను కూడా ఆర్బీఐ మరో మూడు నెలలు పొడిగించింది. అలాగే వర్కింగ్ కేపిటల్ వడ్డీ చెల్లింపులపై విధించిన మారటోరియంను కూడా మరో మూడు నెలలకు పొడిగించింది. తాజా సవరణలతో బెంచ్ మార్క్ వడ్డీ రేట్లు 20 ఏళ్ల కనిష్ఠానికి చేరుకున్నాయని శక్తిదాంత దాస్ తెలిపారు. అవసరమైతే రాబోయే రోజుల్లో వీటిని మరింత తగ్గించే విషయంపై కూడా ఆలోచిస్తామన్నారు.