శరద్ పవార్కు అజిత్ షాక్: ఎన్సీపీలో రెండు వర్గాలుగా: శివసేన ఎమ్మెల్యేలకు గాలం..
మహారాష్ట్ర రాజకీయాల్లో ..తమ మాజీ మిత్రుడు..తాజా ప్రత్యర్ధి ఉద్దవ్ థాక్రే ముఖ్యమంత్రి అవ్వకుండా చివరి నిమిషంలో అంచనా వేయలేని విధంగా పావులు కదిపింది. ఎన్సీపీ మద్దతుతో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అర్ద్రరాత్రి రాష్ట్రపతి పాలన ఉపసంహరించి..పఢ్నవీస్ ను మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది. అయితే, ఎన్సీపీ మద్దతు బీజేపీ సాధించటం వెనుక ఆ పార్టీలోనూ చీలక వచ్చినట్లుగా కనిపిస్తోంది. కొద్ది గంటల ముందే శివసేన అభ్యర్ధి ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించిన శరద్ పవార్ జరిగిన పరిణామాల పైన భిన్నంగా స్పందించారు. అజిత్ బీజేపీతో టచ్ లో ఉన్నారనే విషయం తెలియదని వ్యాఖ్యానించారు. దీంతో..బీజేపీ నేరుగా అజిత్ పవార్ తో సంప్రదింపులు జరిపింది. ఆయనకు మద్దతు ఉన్న 22 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటుకు నిర్ణయించింది.
శివసేన-కాంగ్రెస్ కు బీజేపీ మార్క్ దెబ్బ: రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది: అసలు ఏం జరిగిందంటే..!
శరద్ పవార్ కు తెలియకుండానే..
మహారాష్ట్రలో బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదిపింది. మోదీ..షా ఎత్తుడగలను మరాఠా యోధుడు శరద్ పవార్ సైతం పసి గట్టలేకపోయారు. బీజేపీ ఎత్తులతో ఇప్పుడు ఎన్సీపీ రెండు వర్గాలుగా చీలినట్లుగా కనిపిస్తోంది. పార్టీ అధినేత శరద్ పవార్ తనకు తెలియకుండానే అజిత్ పవార్ బీజేపీతో కలిసారంటూ ఆన ట్వీట్ చేసారు. ఇది ఎన్సీపీ పార్టీగా తీసుకున్న నిర్ణయం కాదని వివరించారు. అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం శరద్ పవార్ మోసం చేసారంటూ ఆరోపణలు మొదలు పెట్టారు. దీని ద్వారా మొత్తం 54 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఎన్సీపీలో అజిత్ పవార్ వర్గంగా 22 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన 32 మంది శరద్ పవార్ నాయకత్వంలోనే ఉన్నట్లుగా అర్దం అవుతోంది. అయితే, అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయమంటూ శరద్ పవార్ చేసిన ట్వీట్ తో ఇప్పుడు బీజేపీ ఆడిన పొలిటికల్ గేమ్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
బీజేపీ..ఎన్సీపీ తో కలిసి ప్రభుత్వం..
ఇక, ఎన్నికల సమయంలో బీజేపీ మరాఠా పార్టీ శివసేనతో కలిసి పోటీ చేసింది. అనూహ్యంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల తరువాత ఇప్పుడు మరో మరాఠా పార్టీ ఎన్సీపీ చీలిక వర్గం నేత అజిత్ పవార్ వర్గంతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 మంది సభ్యులు ఉన్నారు. అందులో ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే 145 మంది సభ్యుల బలం కావాలి. బీజేపీకి 105 మంది సభ్యుల మద్దతు ఉంది. అదే విధంగా ఎన్సీపీ నుండి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్ కు మద్దతుగా 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీని ద్వారా ఈ రెండు కలిపితే 127 కి బలం పెరిగింది. ఇక, స్వతంత్ర అభ్యర్దుల మద్దతు బీజేపీ కూడగట్టినట్లుగా సమాచారం.
Recommended Video
శివసేన నుండి టచ్ లో..
ఇదే సమయంలో ముఖ్యమంత్రి కావాలని..బీజేపీతో విభేదించి.. పాత విబేధాలు పక్కన పెట్టి..తన ప్రత్యర్ధి పార్టీలైన కాంగ్రెస్..ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆశించిన శివసేనకు ఊహించని ఎదురు దెబ్బ ఇది. శివసేన అధినాయకత్వం కాంగ్రెస్..ఎన్సీపీ మద్దతు తో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు సాగిస్తున్న సమయం నుండి శివసేనలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఆ సమయంలో నే కొందరు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారనే ప్రచారం సాగింది. ఇక, బీజేపీ ఇటు ఎన్సీపీలో అజిత్ పవార్ ను మేనేజ్ చేసింది. అదే సమయంలో శివసేనలోని కొందరితో సంప్రదింపులు చేసినట్లుగానూ చెబుతున్నారు. దీంతో..సభలో ఫడ్నవీస్ బలపరీక్ష సమయంలో ఆసక్తి కర సమీకరణాలు తెర మీదకు వచ్చే అవకాశం ఉంది.