సోనియాతో భేటీ రద్దు: మోడీతో శరద్ పవార్ సమావేశం, రచ్చ చేస్తారా? అంటూ శివసేన ఫైర్
న్యూఢిల్లీ: ఓ వైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో గందరగోళ పరిస్థితి ఉండగా.. మరో వైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోడీని కలవడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీని శరద్ పవార్ బుధవారం కలిశారు. అయితే, మహారాష్ట్రలో రైతుల సమస్యలపైనే ప్రధానంగా మోడీతో శరద్ పవార్ చర్చించారు. ఈ సందర్భంగా ప్రధానికి ఓ లేఖను అందించారు.
100 జన్మలు ఎత్తాలి: శరద్ పవార్ వ్యాఖ్యలపై సంజయ్ రౌత్
మహారాష్ట్ర పరిస్థితిపై ప్రధానికి..
ప్రస్తుతం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడంపైనా ప్రస్తావించారు. ప్రధాని మోడీ చొరవ తీసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరినట్లు సమాచారం. రాష్ట్రంలో రెండు జిల్లాల రైతులు పూర్తిగా నష్టపోయారని ప్రధానికి శరద్ పవార్ తెలిపారు. వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో పంట దెబ్బ తిందని, మరట్వాడా, విదర్భల్లో ఈ నష్టం మరింత ఎక్కువగా ఉందని వివరించారు.
మహా రాజకీయ పరిస్థితిపైనా.. మధ్యలోనే అమిత్ షా
అంతేగాక, మహారాష్ట్రలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపైనా వీరిద్దరూ మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. కాగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ భేటీలో పాల్గొనడం గమనార్హం. అయితే, అమిత్ షా భేటీ మధ్యలోనే వెళ్లిపోయారు.
సోనియాతో భేటీ రద్దు చేసుకుని..
అయితే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీని రద్దు చేసుకుని మరీ ప్రధాని మోడీతో శరద్ పవార్ సమావేశం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటు ఆవరణలోనే వీరి భేటీ జరిగింది.
ప్రధాని మోడీని కలిస్తే తప్పేంటి.. అంటూ శివసేన
కాగా, రైతుల సమస్యలపై చర్చించమని తామే శరద్ పవార్ ను ప్రధాని మోడీ వద్దకు పంపామని ఆ పార్టీ చెప్పుకురావడం గమనార్హం. మోడీతో శరద్ పవార్ భేటీ అవడంలో తప్పేముందని శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ప్రధాని దేశం మొత్తానికి చెందిన వ్యక్తని.. ఆయనను పవార్ కలవడంపై ఎలా పడితే అలా ఊహిస్తారా? అని మండిపడ్డారు. కాగా, శివసేన మాత్రం మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలను ఆపడం లేదు. గురువారంలోగా ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వస్తుందని చెబుతోంది. బుధవారం సాయంత్రం శివసేనతో కాంగ్రెస్, ఎన్సీపీ కీలక నేతలు భేటీ కానున్నారు.