పవార్ పంచ్ 54: నాడు కింగ్ కాకుండా చేసింది..నేడు కింగ్ మేకర్ను చేసింది.
అతనొక మరాఠా యోధుడు.. మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో ప్రధానంగా వినిపించే పేరు. అతని చాణక్యత ముందు ఎంతోమంది మహామహులే నిలబడలేకపోయారు. పాచిక వేశాడంటే పారాల్సిందే. ప్రస్తుతం ఆయనే మహారాష్ట్ర రాజకీయాల్లో సూపర్ స్టార్. సైలెంట్గా ఉంటూనే తెరవెనక రాజకీయంగా వైలెంట్గా వ్యవహరిస్తారు. అప్పుడు సోనియాగాంధీని ఎదిరించినా ఇప్పుడు మోడీ నుంచి మెప్పు పొందినా అంతా ఆయనకే చెల్లుతుంది. అతనే ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ఒకప్పుడు కింగ్ అవ్వాల్సిన వాడు నేడు కింగ్ మేకర్ అయ్యాడు.
ఇక అంతా ఒకే!: శరద్ పవార్ను కలిసిన అజిత్ పవార్
పవార్ పవర్ పాలిటిక్స్
శరద్ పవార్... మారాఠా యోధుడు. మహారాష్ట్రలో రాజకీయాలపై పట్టున్న నేత. మహారాష్ట్రలో గత నెలరోజులుగా నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనపై పోరాటం చేసి చివరకు తన పంతం నెగ్గించుకున్నారు. ఎట్టకేలకు మహాఅగాడీ ప్రభుత్వం రావడంలో కీలకంగా వ్యవహరించారు. ఇందుకోసం తన పార్టీకి రావాల్సిన ముఖ్యమంత్రి పదవిని సైతం త్యాగం చేసి శివసేనకే మద్దతుగా నిలిచారు. అంతేకాదు దేవేంద్ర ఫడ్నవీస్తో జరుగుతున్న రెజ్లింగ్కు తానే నాయకత్వం వహిస్తున్నట్లు చెప్పిన నేత శరద్ పవార్. మహారాష్ట్ర రాజకీయాల మొత్తంలో శరద్ పవార్ సెంట్రల్ ఫిగర్గా నిలిచారు.
1970 నుంచి 1980 వరకు శరద్ పవార్ హవా
గత రెండు వారాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను పరిశీలించినవారు పవార్ ఆడుతున్న పవర్ గేమ్ అని అనుమానం వ్యక్తం చేశారు. కానీ వారందరి అనుమానం తప్పని రుజువు చేశారు శరద్ పవార్. ఇక పవార్ రాజకీయ చరిత్ర చూస్తే ఆయన కెరీర్లో ఎక్కువసార్లు ఢిల్లీ పాలకులను వ్యతిరేకించారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీల నుంచి అప్పుడప్పుడు మోడీ-షాలను కూడా వ్యతిరేకించారు. 1970 నుంచి 1980వరకు శరద్ పవార్ తన హవా చాటారు. కాంగ్రెస్లో కూడా పవార్ను ఒక ఐకాన్గానే గుర్తిస్తారు.
అవసరం మేరకే సోనియాతో...
ప్రస్తుతం సోనియాగాంధీపై తనకు ఉన్న గౌరవం, విశ్వాసం కూడా అవసరం మేరకే. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్సీపీ కాంగ్రెస్ విలీనంపై చర్చలు జరిగాయి. అయితే రాహుల్ గాంధీ రాజీనామాతో అది కాస్త మరుగునపడింది. అంతేకాదు ఎన్సీపీ -శివసేన-కాంగ్రెస్ చర్చలు ప్రారంభమైనప్పుడు శరద్ పవార్ అనుమతి లేకుండా తానేమీ చేయలేదని స్వయంగా సోనియాగాంధీ చెప్పారంటే పవార్ పవర్ ఏంటో అర్థమౌతోంది.
అవకాశం ఉన్నప్పటికీ కమలంతో కలవని పవార్
శివసేన బీజేపీతో సంబంధాలు తెంచుకున్నప్పుడు కమలనాథులతో కలిసేందుకు అవకాశం ఉన్నప్పటికీ శరద్ పవార్ ఆ పావు కదపలేదు. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా మరాఠా ప్రజలు ఉంటారనేది ఆయనకు తెలుసు. అంతేకాదు వారి పార్టీవారికి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే బీజేపీ పంచన చేరారనే అపవాదు వస్తుందని గ్రహించిన శరద్ పవార్... బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అంగీకరించలేదు. తనపై కేసులు ఉన్నాయని తెలిసి కూడా బీజేపీతో వెళ్లేందుకు అంగీకరించలేదు. ఇక తన వారసురాలిగా సుప్రియా సూలే వచ్చాక అజిత్ పవార్ శరద్ పవార్తో కాస్త విబేధించారు. తనకు వ్యతిరేకంగా అజిత్ పవార్ ఒక వర్గంను ఏర్పాటు చేసుకుంటున్నారన్న సంగతిని కూడా తెలుసుకున్నట్లు పవార్ సన్నిహితులు చెబుతారు.
అవకాశాలు వచ్చినట్లే వచ్చి...
ఇక శరద్ పవార్కు చాలా అవకాశాలు అందివచ్చినట్లే వచ్చి మిస్ అయ్యాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 1991లో రాజీవ్ గాంధీ మృతి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పవార్కు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది. ఆ సమయంలో ప్రధాని పదవి చేపట్టేందుకు సోనియా అంగీకరించకపోవడంతో పవార్ వర్గం యాక్టివ్గా మారింది. రాజీవ్ గాంధీ మృతితో అంతా శోకసంద్రంలో ఉండగా తను ప్రధాని అయ్యేందుకు తన సన్నిహితులకు డిన్నర్ ఇవ్వడం వంటి కార్యక్రమాలు పవార్కు బూమ్రాంగ్ అయ్యాయి. ఆ సమయంలో పవార్కు మద్దతుగా నిలిచింది 54 మంది ఎంపీలు. ఇక అర్జున్సింగ్తో విబేధాలు రావడంతో అంతా పీవీ నరసింహరావుకే మద్దతుగా నిలవడంతో పీవీ ప్రధాని అయ్యారు.
కింగ్ కాలేక పోయినా కింగ్ మేకర్ అయ్యారు
తన రాజకీయ జీవితంలో ఎక్కువభాగం కాంగ్రెస్లో గడిపినప్పటికీ కాంగ్రెస్ దర్బార్ సంస్కృతితో వేగలేకపోయారు. ఇక కాంగ్రెస్కు దూరంగా రెండుసార్లు ఉన్నారు. రాజీవ్ గాంధీకి పవార్కు పొసకకపోవడంతో కాంగ్రెస్కు దూరంగా ఉన్నారు పవార్. ఇక 1998-99లో సోనియాగాంధీ విదేశీయతను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఎన్సీపీ పేరుతో వేరు కుంపటి పెట్టారు. సోనియా విదేశీయతను ప్రశ్నించిన పవార్ 1961లో ఇటలీకి చెందిన ఓ వైన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారన్న విషయం వెలుగుచూసింది. ఇలా పవార్ రాజకీయ జీవితం ఎక్కడా సాఫీగా సాగలేదు. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే ఇక్కడ కూడా ఎన్సీపీకి 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నాడు అదే 54 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో కింగ్ అయ్యే అవకాశం కోల్పోయిన శరద్ పవార్... నేడు రాష్ట్రంలో మాత్రం అదే 54 మంది ఎమ్మెల్యేలతో కింగ్ మేకర్ అయ్యారు.