అధికారం చేపట్టినా అది మూణ్నాళ్ల ముచ్చటే.. బీజేపీపై శరద్ పవార్ జోస్యం
ముంబై : సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరడంతో రాజకీయ నాయకులంతా ఫలితాలపై దృష్టి పెట్టారు. కేంద్రంలో అధికారం చేపట్టబోయే పార్టీల భవిష్యత్తుపై అంచనా వేస్తున్నారు. తాజాగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్.. బీజేపీ ప్రభుత్వ మనుగడపై జోస్యం చెప్పారు. ఎన్నికల అనంతరం బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టినా ఆ ప్రభుత్వం మనుగడ మూణ్నాళ్ల ముచ్చటే అవుతుందని అభిప్రాయపడ్డారు. సభలో బలం నిరూపించుకోలేక బీజేపీ ప్రభుత్వం పతనం అవుతుందని అంచనా వేశారు. యూపీఏ భాగస్వామి ఎన్సీపీ చీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.
బీజేపీ, ఈసీపై గుస్సా : బాబ్రీ కూల్చివేత కన్నా దారుణ పరిస్థితి ఉందా ? ప్రచారం ఆపివేయడంపై మమత
ఓ మరాఠీ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శరద్ పవార్. గతంలో వాజ్పేయి ప్రభుత్వానికి ఎదురైన పరిస్థితే ఈసారి బీజేపీ ఎదుర్కొంటుందని అభిప్రాయ పడ్డారు. ఫలితాలు వెలువడిన అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి ఆహ్వానం అందినా.. మెజార్టీ నిరూపించుకోలేక చతికిలపడుతుందని అన్నారు.
1996 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అదే ఏడాది మే 16న అటల్ బిహారీ వాజ్పేయ్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే విశ్వాస పరీక్ష సమయంలో బలం నిరూపించుకోలేకపోవడంతో 13 రోజులకే వాజ్పేయి ప్రభుత్వం కుప్పకూలింది. ఈసారి కూడా బీజేపీ ఇలాంటి సంకట స్థితినే ఎదుర్కొంటుందని ఎన్సీపీ చీఫ్ అంచనా వేశారు. బలనిరూపణకు రాష్ట్రపతి 10 నుంచి మూడు వారాలసమయం ఇచ్చినా బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సభ విశ్వాసం పొందలేదని శరద్ పవార్ ధీమా వ్యక్తం చేశారు.
మే 23న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో బీజేపీయేతర పార్టీలన్నీ త్వరలోనే భేటీ అవుతాయని శరద్ పవార్ చెప్పారు. సమావేశంలో విపక్ష నేతలంతా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు ప్రకటించారు.