యాంటీ బీజేపీ ఫ్రంట్: వైఎస్ జగన్ కోసం ఎన్సీపీ చీఫ్ రాయబారం!
ముంబై: వరుసగా రెండోసారి ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి ఏర్పడవచ్చంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసిన నేపథ్యంలో..ఆ పార్టీ అప్రమత్తమైంది. తటస్థులను కలుపుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు ఆరంభించింది. మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంటుందంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి.
కాంగ్రెస్ దూత బాబుకు చుక్కెదురు: సంధి ప్రయత్నాలకు గండి: సోనియాతో భేటీకి బెహన్జీ ససేమిరా
25 లోక్సభ స్థానాలకు 20కి పైగా సీట్లను వైఎస్ఆర్ సీపీ తన ఖాతాలో వేసుకోవచ్చంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. దీనితో ఆ పార్టీతో మంతనాలు సాగించడానికి సిద్ధపడింది కాంగ్రెస్. దీనికోసం తలపండిన రాజకీయ నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ను రంగంలో దింపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సంప్రదింపులు సాగించే బాధ్యతను ఆయన చేతుల్లో పెట్టింది కాంగ్రెస్ అధిష్ఠానం.
హంగ్ వస్తే.. ఆదుకుంటారనే ముందుచూపు
భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాలు వస్తాయంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. అయినప్పటికీ- కాంగ్రెస్లో ఆశలు సజీవంగా ఉన్నాయి. హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఆ పార్టీ అంతర్గత సర్వేలో తేలడమే దీనికి ప్రధాన కారణం. ఈ క్రమంలో- తటస్థంగా ఉన్న వైఎస్ఆర్సీపీని తమ వైపు తిప్పుకోవాలని తీర్మానించుకుంది. హంగ్ వస్తే ఆదుకుంటారనే ముందుచూపు వల్లే కాంగ్రెస్.. వైఎస్ జగన్కు గాలం వేసే పనిలో పడింది.
ఇప్పటికే ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు నిర్వమించడానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ను నియమించింది. కమల్నాథ్కు దక్షిణాది రాజకీయాలపై పెద్దగా పట్టు లేకపోవడం వల్ల ఈ బాధ్యతను శరద్ పవార్కు అప్పగించినట్లు చెబుతున్నారు. ఈ నెల 23న ఫలితాలు వెలువడిన వెంటనే బీజేపీయేతర పార్టీలన్నీ న్యూఢిల్లీలో కలుస్తాయని శరద్ పవార్ వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ భేటీకి హాజరు కావాలంటూ సోనియాగాంధీ స్వయంగా సంతకం చేసిన లేఖలను బీజేపీయేతర పార్టీలకు పంపించినట్లు సమాచారం. ఈ సమావేశానికి వెళ్లాలా? వద్దా? అనే విషయంపై వైఎస్ జగన్ ఇంకా ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదు. ఈ నెల 23వ తేదీన ఫలితాలు వెల్లడైన తరువాతే.. ఆయన తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని వైఎస్ఆర్ సీపీ కీలక నాయకులు చెబుతున్నారు.