సరిహద్దులో అసలేం జరుగుతుంది... పూర్తి వివరాలు చెప్పాల్సిందే.. : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్
గత నాలుగైదు నెలలుగా భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు నిత్యం హాట్ టాపిక్గా ఉంటూ వస్తున్నాయి. సమస్య పరిష్కారానికి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన,మిలటరీ స్థాయి చర్చలు జరుపుతున్నప్పటికీ... కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం సాధించినట్లు చెబుతున్నప్పటికీ... ఆ తర్వాత పాత సీనే రిపీట్ అవుతోంది. అవగాహన ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ చైనా బరితెగించడం... ఆ తర్వాత భారత్ ఎత్తుకు పై ఎత్తులు వేయడం జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అసలేం జరుగుతుందో చెప్పండి : శరద్ పవార్
రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ముందు త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఒక్కరే భారత్-చైనా సరిహద్దు ప్రతిష్ఠంభనపై బిపిన్ రావత్ను ప్రశ్నించారు. అసలు సరిహద్దులో ఏం జరుగుతుందో చెప్పాలని... దీనిపై పార్లమెంట్ డిఫెన్స్ ప్యానెల్కు సమగ్ర ప్రజేంటేషన్ ఇవ్వాలని కోరారు. త్వరలోనే రక్షణ మంత్రిత్వ శాఖ దీనిపై స్పందించే అవకాశం కనిపిస్తోంది.
'సరిహద్దు' అంశాన్ని ప్రస్తావించని రాహుల్..
ఇక ఇదే సమావేశానికి హాజరైన పార్లమెంట్ డిఫెన్స్ ప్యానెల్ సభ్యుడు రాహుల్ గాంధీ భారత్-చైనా సరిహద్దు అంశాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. మిలటరీ అంతర్గత విషయాలైన రేషన్,ఫుడ్ సప్లైలో సైనికులకు,సైనిక అధికారులకు మధ్య తేడాలపై బిపిన్ రావత్ను ఆయన ప్రశ్నించారు. అయితే జవాన్లు ఎక్కువగా రోటీలు తినేందుకే ఇష్టపడుతారని,అధికారులు బ్రెడ్ తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతారని... అందుకే భోజనం సప్లై విషయంలో ఇరువురి మధ్య తేడాలున్నాయని బిపిన్ రావత్ వెల్లడించారు. చాలావరకు సైనికులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారే ఉంటారని... వారిలో అత్యధికులు నెయ్యిని ఇష్టపడుతారని చెప్పారు. మరోవైపు అధికారులు ఎక్కువగా జున్ను తినేందుకు ఇష్టపడుతారని చెప్పారు.ఉత్తర భారతదేశానికి చెందిన సైనికులు రోటీ తినేందుకు ఇష్టపడితే... దక్షిణ భారతదేశానికి చెందిన సైనికులు అన్నం తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతారని తెలిపారు.
ఓవైపు చర్చలు... మరోవైపు చైనా వక్రబుద్ది...
లదాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి గత నాలుగైదు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 15 హింసాత్మక ఘటనతో అవి తారాస్థాయికి చేరాయి. అప్పటినుంచి ఇరు దేశాల సైన్యాన్ని వాస్తవాధీన రేఖ నుంచి వెనక్కి పిలిచేందుకు చర్చల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇలా ఓవైపు చర్చలు జరుగుతుండగానే... అవగాహన ఒప్పందాలు కుదురుతుండగానే... చైనా చీటికి మాటికి వాటిని ఉల్లంఘిస్తూ తన వక్రబుద్దిని బయటపెట్టుకుంటోంది.
ఇప్పుడైనా కట్టుబడి ఉంటుందా...
గురువారం(సెప్టెంబర్ 11) రష్యాలోని మాస్కో వేదికగా జరిగిన షాంఘై కోఆరేషన్ సదస్సులో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఐదు అంశాల్లో ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. ఇందులో సైన్యం ఉపసంహరణ,సరిహద్దులో శాంతిని నెలకొల్పడం కీలక అంశాలు. అయితే గతంలోనూ చైనా వీటికి కట్టుబడి ఉంటామని ప్రకటనలిచ్చి మాట తప్పింది. కనీసం ఇప్పుడైనా ఆ మాటను నిలబెట్టుకుంటుందా లేక పాత ధోరణినే కనబరుస్తుందా అన్నది వేచి చూడాలి.