టెన్షన్ టెన్షన్: ఈడీ ఆఫీస్కు వస్తానన్న శరద్ పవార్.. ముంబైలో భారీగా పోలీసుల మోహరింపు
న్యూఢిల్లీ/ముంబై: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ముంబైలోని ఈడీ కార్యాలయానికి తాను వ్యక్తిగతంగా హాజరవుతానని తెలిపారు. అయితే మరాఠా బాస్ను విచారణ చేసేందుకు ఈడీ ఇప్పుడే ఆసక్తి చూపడం లేదు. అవసరమైతే విచారణకు పిలుస్తామని ఈడీ చెబుతోంది. మనీలాండరింగ్ కేసులో శరద్ పవార్ పేరును చేర్చింది. దీంతో తను ఈడీ కార్యాలయానికి వస్తానని వెల్లడించారు. ప్రస్తుతం శరద్ పవార్ ఈడీ కార్యాలయానికి రావాల్సిన పనిలేదని భవిష్యత్తులో అవసరమైతే విచారణకు పిలుస్తామని ఈడీ అధికారులు తెలిపారు.
ఈడీ ఆఫీసుకు శరద్ పవార్.. కార్యాలయం ముందు గట్టి భద్రత
ఓ వైపు ఈడీ అధికారులు పవార్కు నోటీసులు ఇచ్చామని చెబుతుండగా సమన్ల గురించి ఎలాంటి సమాచారం లేదని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం రోజున ఈడీ కార్యాలయానికి తాను వస్తానని శరద్ పవార్ తెలిపిన నేపథ్యంలో ఈడీ కార్యాలయం ముందు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ఎన్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈడీ ఆఫీస్ పరిసరాల్లో డ్రోన్లతో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు.ముందస్తుగా ముంబై పోలీస్ను ట్యాగ్ చేస్తూ శరద్ పవార్ తన రాకకు సంబంధించిన విషయాలను ట్వీట్ చేశారు.
ఈడీ కార్యాలయానికి కార్యకర్తలు రావొద్దు
సెప్టెంబర్ 27న మధ్యాహ్నం 2 గంటలకు తాను బాలార్డ్ ఎస్టేట్లో ఉన్న ఈడీ కార్యాలయానికి వస్తున్నట్లు అందులో పేర్కొన్నారు . ఎన్సీపీ కార్యకర్తలు ఈడీ కార్యాలయం దగ్గరకు రాకూడదని అందులో పేర్కొన్నారు. సంస్థలను గౌరవించాల్సిన బాధ్యత తమపై ఉందని పవార్ గుర్తు చేశారు. పోలీసులకు సహకరించాల్సిందిగా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.
కేసు వివరాలు ఇలా ఉన్నాయి
మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్ మాజీ అధినేతలపై మనీలాండరింగ్ ఆరోపణలు రావడంతో బాంబే హైకోర్టు విచారణ చేయాల్సిందిగా ఈడీని కోరింది. ఈ వ్యవహారంలో దాదాపు రూ.25వేల కోట్లు దారిమళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక విచారణలో భాగంగా ఈ బ్యాంకుకు సంబంధించిన మాజీ ఛైర్మెన్లను ఎండీలను, బ్యాంకుతో సంబంధం ఉన్న సీనియర్ రాజకీయ నాయకులను ఈడీ విచారణ చేస్తోంది. వీరిలో చివరిగా పవార్ను ఈడీ విచారణ చేయనుంది. ఆలోగా మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల తేదీ అక్టోబర్ 21 దగ్గర పడుతుంది. కేసులో ఇతరులు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే పవార్ను విచారణ చేస్తారని సమాచారం. వచ్చే వారం నుంచే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ జరగనుంది. పవార్ మేనల్లడు మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు మరికొందరు ఎన్సీపీ నాయకులకు సమన్లు అందాయి.
రాజకీయ కక్ష సాధింపు చర్య
శరద్ పవార్కు ఇతర బీజేపీయేతర పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. మహారాష్ట్రలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శరద్ పవార్ను కేసుల పేరుతో వేధిస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఈ మేరకు ఆయన ట్విటర్లో పోస్టు చేశారు. రాజకీయంగా శరద్ పవార్ను అణగదొక్కే ప్రయత్నం బీజేపీ చేస్తోందని మండిపడ్డారు. శివసేన కూడా శరద్ పవార్కు మద్దతుగా నిలిచింది. ప్రభుత్వం తనను కావాలనే లక్ష్యంగా చేసుకుని రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని శివసేన మండిపడింది.