కాంగ్రెస్ లో ముసలం: శివసేనతో కలిస్తే అంతే సంగతులు: సీనియర్ నేత..!
ముంబై: మహారాష్ట్రంలో నెలకొన్ని రాజకీయ సంక్షోభ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి కాంగ్రెస్ లో ముసలం పుట్టించేలా కనిపిస్తోంది. గవర్నర్ ఆహ్వానించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయ జనతాపార్టీ తన అశక్తతను వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో.. శివసేనతో కలిసి అధికారాన్ని అందుకోవడానికి కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పావులు కదుపుతున్నాయనే వార్తలు మహారాష్ట్రలో రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి. ఈ వార్తలపై మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో అసంతృప్తి వ్యక్తమౌతోంది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్ నిరుపమ్ సహా మరి కొందరు నాయకులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
In the current political arithmetic in Maharashtra, its just impossible for Congress-NCP to form any govt. For that we need ShivSena. And we must not think of sharing power with ShivSena under any circumstances.
— Sanjay Nirupam (@sanjaynirupam) November 10, 2019
That will be a disastrous move for the party.#MaharashtraCrisis
శివసేనతో కలవడం చారిత్రక తప్పిదం..
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో శివసేనకు మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ ముందుకొస్తే.. అది పార్టీ తీసుకున్న చారిత్రక తప్పిదం అవుతుందని సంజయ్ నిరుపమ్ అన్నారు. పార్టీ నాశనమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ మూలాలే దెబ్బతింటాయని చెప్పారు. లౌకికవాద పార్టీగా ఉన్న ముద్ర చెరిగిపోయే ప్రమాదం ఉందని, ఫలితంగా- పార్టీకి అండదండగా ఉంటూ వస్తోన్న కొన్ని వర్గాల ప్రజలు దూరమౌతారని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆయన ఓ ట్వీట్ చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిని ఆహ్వానించాలంటూ మిలింద్ దేవ్ రా ట్వీట్ చేసిన కాస్సేపటికే నిరుపమ్ కూడా ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.
ప్రస్తుత సమీకరణాల్లో ఏ పార్టీ కూడా..
మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ విచిత్ర పరిస్థితులు ఏర్పడ్డాయని, రాజకీయ సమీకరణాలు ఏ ఒక్క పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా దోహద పడేలా లేవని అన్నారు. కాంగ్రెస్-ఎన్సీపీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని సంజయ్ నిరుపమ్ తేల్చి పడేశారు. శివసేనతో కలిసి అధికారాన్ని అందుకోవడానికి చేసే ప్రయత్నాల నుంచి వెంటనే విరమించుకోవాలని చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆలోచన కూడా చేయకూడదని అన్నారు. అలాంటి నిర్ణయం తీసుకున్నా, ఆ దిశగా అడుగులు వేసినా అది పార్టీ నాశనానికి దారి తీస్తుందని హెచ్చరించారు.