దేశ ద్రోహం కేసు : జేఎన్యూ మాజీ విద్యార్థి శార్జిల్ ఇమామ్ బీహార్లో అరెస్ట్..
అసోం సహా ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)మాజీ విద్యార్థి శార్జిల్ ఇమామ్పై ఐదు రాష్ట్రాల్లో దేశ ద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా బీహార్లోని జెహానాబాద్లో ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వెలుగుచూసినప్పటి నుంచి ఇమామ్ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు.
అరెస్ట్ అనంతరం ఢిల్లీకి తరలింపు..
జెహానాబాద్లోని టకో ప్రాంతంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టి ఎట్టకేలకు శార్జిల్ ఇమామ్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం విచారణ నిమిత్తం అతన్ని ఢిల్లీకి తరలించారు. మరోవైపు అసోంలోనూ శార్జిల్ ఇమామ్పై ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం ఊపాతో పాటు నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టం(CAA) కనీసం కొద్ది నెలలైనా అసోం భారత్ నుంచి వేరుకావచ్చు అని శార్జిల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఈ కేసులు నమోదు చేశారు.
మణిపూర్,అరుణాచల్ ప్రదేశ్లలోనూ..
అసోంతో పాటు మణిపూర్,అరుణాచల్ ప్రదేశ్లలోనూ శార్జిల్ ఇమామ్పై కేసులు నమోదయ్యాయి. ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి విడగొట్టాలన్న వివాదాస్పద వ్యాఖ్యలపై కేసులు నమోదు చేసినట్టు అక్కడి పోలీసులు తెలిపారు. మరోవైపు అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీలో సీఏఏకి వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగం ఇచ్చాడన్న కారణంగా శార్జిల్ ఇమామ్ సోదరుడిపై కూడా కేసు నమోదైంది.
ఇమామ్ తల్లి స్పందన..
శార్జిల్ ఇమామ్ బీహార్లో అరెస్టయిన నేపథ్యంలో.. ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయవద్దని అన్నారు. ఈ కేసు విషయంలో నిజానిజాలను కోర్టు తేలుస్తుందన్నారు. శార్జిల్పై దేశ ద్రోహం కేసు నేపథ్యంలో అతని తల్లి కూడా మీడియాతో మాట్లాడారు. శార్జిల్ చట్టాన్ని ఉల్లంఘించేవాడు కాదని,దర్యాప్తు సంస్థల ఎదుట లొంగిపోతాడని అన్నారు. అంతేకాదు,ఢిల్లీలోని షాహీన్బాగ్లో సీఏఏకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనను విరమించుకునేందుకు కూడా అతను సిద్దంగా ఉన్నట్టు చెప్పారు.
కొనసాగుతోన్న దర్యాప్తు..
ఢిల్లీలోని షాహీన్బాగ్లో సీఏఏకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో శార్జిల్ ఇమామ్ కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఈశాన్య రాష్ట్రాలపై శార్జిల్ ఇమామ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఈ నెల 16న అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీలో చేసినట్టుగా ఇప్పటికే అలీఘడ్ ఎస్పీ తెలిపారు. ఇమామ్ వ్యాఖ్యలపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.