ప్రసార భారతీ సీఈవోగా శశి శేఖర్ వెంపటి: దూరదర్శన్ కు కొత్త రూపురేఖలు
న్యూఢిల్లీ: ప్రసిద్ధి చెందిన ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగి శశి శేఖర్ వెంపటిని ప్రసార భారతీ కొత్త సీఈవోగా నియమించారు. శశి శేఖర్ వెంపటి ప్రసార భారతీలో తాత్కాలిక సభ్యుడిగా ఉండేవారు. భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ నేతృత్వంలోని ముగ్గురు కమిటీ సభ్యులు శశి శేఖర్ వెంపటిని ప్రసార భారతీ సీఈవో నియమించారు.
ముంబై ఐఐటీలో విద్యాభ్యాసం చేసిన శశి శేఖర్ వెంపటి ఐదు సంవత్సరాల కాలం ప్రసార భారతీ సీఈవోగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఏడు నెలల క్రితం ప్రసార భారతీ సీఈవో పదవికి జవహార్ సిక్కార్ రాజీనామా చేశారు. జవహర్ సిక్కార్ స్థానంలో శశి శేఖర్ వెంపటి బాధ్యతలు స్వీకరించనున్నారు.
కేంద్ర ప్రభుత్వంలోని ఇన్ఫర్ మేషన్ అండ్ బ్రాండ్ కాస్ట్ శాఖ పరిధిలోని ప్రసార భారతీ స్వేచ్చ సంస్థగా వ్యవహరిస్తోంది. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ ప్రసార భారతీ పరిధిలోకి వస్తాయి. ప్రసార భారతీ సీఈవోగా శశి శేఖర్ వెంపటిని నియమించడంతో దూరదర్శన్ రూపురేఖలు మారిపోతున్నాయి.
దూరదర్శన్ ను అత్యున్నత టెక్నాలజీతో ముందుకు నడిపించాలని ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఐటీ టెక్నాలజీలో దిట్ట అయిన శశి శేఖర్ వెంపటి ఆ దిశగానే దూరదర్శన్ ను ముందుకు తీసుకు వెలుతారని అందరూ భావిస్తున్నారు.