కాంగ్రెస్ ఎందుకు క్షమాపణ చెప్పాలి... బీజేపీ డిమాండ్పై శశి థరూర్ రివర్స్ ఎటాక్...
పుల్వామా ఉగ్రదాడి తమ ఘనతే అని స్వయంగా పాకిస్తాన్ మంత్రి ఫవద్ చౌదరి ప్రకటించడంతో పాక్ వక్రబుద్ది మరోసారి బట్టబయలైంది. పాక్ చేసిన ఈ ప్రకటనను బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్పై ఎక్కుపెడుతోంది. పుల్వామా దాడి విషయంలో అప్పట్లో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడేం సమాధానం చెప్తుందని ప్రశ్నిస్తోంది. ఈ దాడికి సంబంధించి ప్రధాని మోదీపై ప్రశ్నాస్త్రాలు ఎక్కుపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందిస్తూ... బీజేపీ డిమాండును తోసిపుచ్చారు.
ట్విట్టర్ ద్వారా స్పందించిన శశి థరూర్... కాంగ్రెస్ ఎందుకు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు. 'కాంగ్రెస్ను ఎందుకు క్షమాపణలు చెప్పమంటున్నారో తెలుసుకునేందుకు నేనిప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. సైనికుల భద్రతను కోరినందుకే క్షమాపణలు చెప్పమంటున్నారా...? లేక రాజకీయాలను పక్కనపెట్టి దేశం కోసం ఒక్కటైనందుకా...? లేక అమరులైన సైనికుల కుటుంబాలకు సంతాపం ప్రకటించినందుకా...?' అని శశి థరూర్ బీజేపీని ప్రశ్నించారు.పుల్వామా దాడిపై కుట్ర కోణాలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ దేశానికి క్షమాపణలు చెప్పాలంటూ కేంద్రమంత్రి జవదేకర్ చేసిన వ్యాఖ్యలపై శశి థరూర్ ఇలా స్పందించారు.
Recommended Video
ఇటీవల పాకిస్తాన్ మంత్రి ఫవద్ చౌదరి ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా పుల్వామా దాడి తమ ఘనతే అని ప్రకటించడం తెలిసిందే. పుల్వామా మారణహోమం క్రెడిట్ నూటికి నూరు శాతం ఇమ్రాన్ సర్కారుకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. సాక్షాత్తు పార్లమెంటులో ఆ దేశ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేకెత్తించాయి. పుల్వామా దాడి తర్వాత భారత్ పాక్పై ఆరోపణలు చేయగా... తమకేమీ సంబంధం లేదంటూ ఎన్నోసార్లు పాక్ బుకాయించింది. పైగా అంతర్జాతీయ వేదికలపై సైతం భారత్నే బద్నాం చేసే ప్రయత్నం చేసింది. తాజాగా ఆ దేశ మంత్రే పుల్వామా దాడి తమ ఘనత అని చెప్పుకోవడంతో పాకిస్తాన్ వక్రబుద్ది మరోసారి బట్టబయలైంది. ఈ నేపథ్యంలో పుల్వామా దాడిని రాజకీయం చేయాలని చూసిన కాంగ్రెస్ పార్టీ... ఇకనైనా తమ విధానం మార్చుకోవాలని ప్రధాని మోదీ సైతం పరోక్షంగా హెచ్చరించారు.
I am still trying to figure out what @INCIndia is supposed to apologise for. For expecting the government to keep our soldiers safe? For rallying around the flag rather than politicising a national tragedy? For expressing condolences to the families of our martyrs? #Pulwama https://t.co/oxY2UOFeum
— Shashi Tharoor (@ShashiTharoor) October 31, 2020