‘పీఓకే’ లేకుండానే శశిథరూర్ ట్విట్టర్ పోస్ట్: నెటిజన్లు ఏకిపారేశారు, బీజేపీ కూడా, ట్వీట్ డిలీట్!
తిరువనంతపురం: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ శనివారం ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన భారతదేశ చిత్రటం వివాదాస్పదంగా మారింది. ఆయన పోస్ట్ చేసిన చిత్రపటంలో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) లేకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని గమనించిన నెటిజన్లు ట్విట్టర్లో కాంగ్రెస్ ఎంపీపై తీవ్రంగా మండిపడుతున్నారు.
పౌరసత్వ నిరసనల్లో తొలిసారంటూ..
‘పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆదివారం కేరళలోని కోజికోడ్లో జరగనున్న ర్యాలీకి నాయకత్వం వహిస్తూ.. ఈ నిరసనల్లో నేను మొదటిసారిగా పాల్గొంటున్నాను. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులూ..' అంటూ మనదేశ చిత్ర పటంతో ట్వీట్ చేశారు.
పీవోకే లేకుండానే..
ఆయన ట్వీట్ చేసిన మనదేశ చిత్ర పటంలో జమ్మూకాశ్మీర్ పూర్తిగా లేకపోవడం గమనార్హం. పీఓకే లేని జమ్మూకాశ్మీర్ రాష్ట్ర పటాన్ని ఆయన ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు శశిథరూర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘చాచా నెహ్రూ, ఇందిరా గాంధీలు కాశ్మీర్ను పాకిస్థాన్కు బహుమతిగా ఇచ్చేశారు.. కాబట్టి కాశ్మీర్ పాక్తోనే ఉండాలి వారు(కాంగ్రెస్) కోరుకుంటున్నారు' అని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.
ఏకిపారేసిన నెటిజన్లు..
‘శశిథరూర్ చెప్పింది నిజమే.. మనం మన దేశాన్ని రక్షించుకోవాలి. ఇలాంటి డర్టీ మైండ్సెట్ ఉన్నవాళ్లతో మన దేశాన్ని నిజంగానే కాపాడుకోవాలి' అని మరో నెటిజన్లు విమర్శించారు. ‘సరైన దేశ చిత్ర పటాన్ని గుర్తించలేని నీలాంటి మేధావుల బారి నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇది అనుకోకుండా జరిగిన పొరపాటు కాదు. ఉద్దేశపూర్వకంగా జరిగింది. మిస్టర్ థరూర్.. దేశం మిమ్మల్ని గమనిస్తోంది' అంటూ ఇంకో నెటిజన్ స్పందించారు.
క్షమాపణ చెబుతారా? లేదా?
బీజేపీ నేతలు కూడా తీవ్రంగా మండిపడ్డారు. ‘మీరు, మీ పార్టీ కార్యకర్తలు తరచూ ఇలాంటి చిత్రపటాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? దేశాన్ని వక్రీకరించడం, విభజించడం, నాశనం చేయడమే కాంగ్రెస్ విధానమా? ఇలాంటి పని చేసినందుకు మీరు క్షమాపణ చెప్పాలా? వద్దా?' అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర నిలదీశారు.
విమర్శలతో ట్వీట్ తొలగించని శశిథరూర్
‘పాకిస్థాన్లోని పెద్దల ఆదేశాలతో పాక్ ఉగ్రవాదులు ఆయుధాలతో భారతదేశంలో దాడులు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, శశిథరూర్కి ఎవరు ఆదేశాలిచ్చారు? ఇలాంటి వక్రీకరించిన ఇండియా మ్యాప్ని? పోస్ట్ చేయమని.. సోనియా గాంధీనా?.. రాహుల్ గాంధీ భారతదేశానికి ఇచ్చే గౌరవం ఇదేనా?' అంటూ కర్ణాటక బీజేపీ తీవ్రంగా మండిపడింది. విమర్శలు వెల్లువెత్తుండటంతో శశిథరూర్ తన ట్వీట్ను ఆ తర్వాత తొలగించడం గమనార్హం.