నా సత్తా ఏంటో చూస్తారు: 30న శశిథరూర్ నామినేషన్, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక 17న
తిరువనంతపురం: కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతుండగా.. పోటీ చేసే నేతల వ్యవహారం ఆసక్తిగా మారుతోంది. సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, ఎంపీ శశి థరూర్, ఇతర నేతలు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న విషయం తెలిసిందే. మరో ఇద్దరు సీనియర్ నేతలు కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలో లేమని ప్రకటించారు.
30న శశిథరూర్ నామినేషన్
కాగా, ఎంపీ శశిథరూర్ పార్టీ అధ్యక్ష పదవికి సెప్టెంబర్ 30, 2022 ఉదయం 11 గంటలకు నామినేషన్ నమోదు చేస్తారని కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఇన్ఛార్జ్ మధుసూదన్ మిస్త్రీ మంగళవారం వెల్లడించారు. తన నామినేషన్ దాఖలు గురించి ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో పాల్గొనడంపై దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తల నుంచి మద్దతు ఉందన్నారు. నామినేషన్ రోజున తన బలమేంటో తెలుస్తుందన్నారు. మెజార్టీ రాష్ట్రాల నుంచి పార్టీ కార్యకర్తల నుంచి మద్దతు లభిస్తేనే.. తాను పోటీలో ఉంటానని శశిథరూర్ స్పష్టం చేశారు.
సోనియా, ప్రియాంకకు అభ్యంతరం లేదన్న శశిథరూర్
అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండాలని తనను చాలా మంది అభ్యర్థించారని శశిథరూర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను నామినేషన్ పత్రాలను పొందానని, నేతలను కలుస్తూ, వారితో మాట్లాడుతున్నానని చెప్పారు. తన అభ్యర్థిత్వానికి ప్రతిపాదకులుగా 50 మంది ప్రతినిధులు అవసరమని తెలిపారు. ఈ పోటీ గురించి సోనియా గాంధీ, ప్రియాంకతో చర్చించానని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు వెల్లడించారని థర్మూర్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో 25 ఏళ్లలో తొలిసారి..
కాగా, 1998లో జితేంద్ర ప్రసాద్ను ఓడించిన సోనియా గాంధీ కాకుండా మరొకరు కాంగ్రెస్కు నాయకత్వం వహించడం 25 ఏళ్లలో ఇదే తొలిసారి. 1996లో శరద్ పవార్, రాజేష్ పైలట్లను ఓడించిన గాంధీయేతర పార్టీ ఆఖరి నాయకుడు సీతారాం కేస్రీ. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నామినేషన్ పత్రాలను స్వీకరించేందుకు కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ దేశ రాజధానిలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంటారని ఏఎన్ఐ నివేదించింది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక అక్టోబర్ 17న, 19న ఫలితాలు
కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. పార్టీ కొత్త అధ్యక్షుడి కోసం పైన పేర్కొన్న ఎన్నికలు అక్టోబర్ 17 న అన్ని పీసీసీలలో జరగనున్నాయి. అభ్యర్థుల తుది జాబితాను అక్టోబర్ 8న సాయంత్రం 5 గంటలకు ప్రకటిస్తారు. ఓట్ల లెక్కింపు తర్వాత వెంటనే ఫలితాలు అక్టోబర్ 19న వెల్లడి కానున్నాయి.ఆర్టికల్ 18 నిబంధనల ప్రకారం భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిని నామినేట్ చేయాలని మిస్త్రీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులను కోరారు.