శశికళ డైరెక్షన్..! టీటీవి యాక్షన్..! పార్టీలో చురుగ్గా పదవుల పందేరం..!!
చెన్నై: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే)ను రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్లో రిజిస్టర్ చేసేందుకు రంగం సిద్ధమైంది. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్ల క్రితం చెన్నై ఆర్కే నగర్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోదిగిన దినకరన్ ఆనాడు కుక్కర్ చిహ్నంపై పోటీ చేసి గెలుపొందారు.
ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శిగా టీటీవి.. ఎందుకంత తొందరంటున్న పార్టీ శ్రేణులు..
ఇలా లోక్సభ ఎన్నికలు, శాసనసభ ఉప ఎన్నికలు ముగిశాయో... లేదో... ఏఎంఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ రాజకీయంగా మరో కీలక అడుగు ముందుకేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ‘చిన్నమ్మ' జైలు నుంచి బయటికొస్తే పార్టీ నాయకత్వ పగ్గాలు ఆమెకే అప్పగించడానికి రంగం సిద్ధం చేశారు. చెన్నైలోని ఆర్కేనగర్ శాసనసభకు జరిగిన ఉప ఎన్నికల్లో అనూహ్య, భారీ విజయం ద్వారా తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా ఏఎంఎంకే ఉప ప్రధానకార్యదర్శి టీటీవీ దినకరన్ మారిన విషయం తెలిసిందే.
ఎన్నికలు ఐపోగానే అత్యవసర భేటీ..! రాజకీయ ప్రభావంపై నేతల ఆసక్తి..!!
హంగూ, ఆర్భాటాల్లేకుండా రాజకీయ చదరంగంలో ఆయన కదిపే పావులు ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్షాల దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు, శాసనసభ ఉప ఎన్నికలు ముగిసి ఫలితాల కోసం అంతా వేచిచూస్తుండగా... అందులో టీటీవీ దినకరన్ ప్రభావంపై రాజకీయవర్గాల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై అశోక్నగర్లోని ఏఎంఎంకే ప్రధానకార్యాలయంలో శుక్రవారం పార్టీ నిర్వాహకుల సమావేశం జరిగింది.
పార్టీని బలోపేతం చేస్తున్న దినకరణ్..! శశికళ సూచనల మేరకే మార్పులు..!!
ఇందులో కీలక నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని మిగతా 4 శాసనసభ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయమై చర్చించినట్టు సమాచారం. అలాగే ఏఎంఎంకే ప్రధానకార్యదర్శిగా టీటీవీ దినకరన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటివరకు పార్టీ ప్రధానకార్యదర్శి హోదాలో శశికళ ఉండటం గమనార్హం. ప్రస్తుతం టీటీవీ దినకరన్ ఎన్నికతో ఆ పదవికి ఆమె దూరమయ్యారు. సమావేశం తర్వాత విలేకర్లతో పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ సినీ నటి సీఆర్ సరస్వతి మాట్లాడుతూ... ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్ ఏకగ్రీవ ఎన్నిక గురించి అధికారికంగా వెల్లడించారు.
అంతా చిన్నమ్మ చెప్పినట్టే..! జైలు నుండి రాగానే శశికళకు కీలక నదవి..!!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక పరప్పణ అగ్రహార జైలులోని శశికళ విడుదలై బయటకు వచ్చిన తర్వాత పార్టీ అధినాయకురాలిగా ఆమెను ఎన్నుకుంటామని తెలిపారు. పార్టీ ప్రచారకార్యదర్శి తంగ.తమిళ్సెల్వన్ మాట్లాడుతూ... ఏఎంఎంకేను రాజకీయ పార్టీగా నమోదు చేయనున్నామని, ఆ తర్వాత శశికళను పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నుకుంటామని తెలిపారు. ఉపాధ్యక్షుల ఎన్నిక కూడా జరగనుందని, శశికళ సూచనలు మేరకే ప్రస్తుతం పార్టీలో మార్పులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.