అద్వానీకి వెంకయ్య కౌంటరా, శతృఘ్నసిన్హా యూటర్న్
ఢిల్లీ: బీహార్ ఎన్నికల ఫలితాలతో కేంద్రానికి, పార్టీ నాయకత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు గురువారం అన్నారు. బీహార్ ఎన్నికల ఓటమికి ఎవరినీ బాధ్యులను చేయడం లేదని ఆయన తెలిపారు. ఢిల్లీలో 'రీఫార్మ్స్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఇండియా' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. జాతీయ పార్టీలు ఒక రాష్ట్రంలో గెలవడం, మరో రాష్ట్రంలో ఓడిపోవడం సహజమేనని చెప్పారు. బిజెపి మొదటి నుంచి సమష్టి నాయకత్వం, బాధ్యతతో ముందుకు వెళ్తోందన్నారు. ఓటమికి సమష్టి బాధ్యత వహించాల్సిందేనన్నారు.
స్థానిక అంశాలు, సామాజిక సమీకరణాల వల్లే ఓడిపోయామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ చాలా ఎన్నికల్లో గెలిచిందని, కేవలం కొన్నిచోట్ల మాత్రమే ఓడిపోయిందన్నారు. అయితే కేంద్ర ప్రభావం కొన్ని రాష్ట్రాల్లో ఉండకపోవచ్చని చెప్పారు.
బీహార్ ఎన్నికల్లో ఓటమికి ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షులు అమిత్ షాలు మాత్రమే బాధ్యులు కాదని, పార్టీ సమష్టి బాధ్యత వహిస్తుందన్నారు. 2009లో అద్వానీ నాయకత్వంలో అధికారంలోకి రాలేకపోయామని, 2014 ఎన్నికల్లో మాత్రం అభివృద్ధి వైపు ప్రజలు మొగ్గు చూపారన్నారు. పార్టీలో లోటుపాట్లు సరిచేసుకుంటామన్నారు.
దేశాన్ని సంస్కరించడం, సమూలంగా మార్చడమే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని చెప్పారు. బాగు చేయడం, మార్చడం ఇదే మోడీ మంత్రమన్నారు. కాగా, బీహార్ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత ఎవరిదో తేల్చాలని బిజెపి అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ తదితరులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వెంకయ్య వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
'ముఖ్యమంత్రి అభ్యర్థి' వ్యాఖ్యలపై శతృఘ్ను సిన్హా యూ టర్న్
బీహార్ ఎన్నికల్లో తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఉంటే బీజేపీకి మరిన్ని స్థానాలు వచ్చుండేవనే విషయాన్ని తాను ఎప్పుడూ అనలేదని ఆ పార్టీ ఎంపీ శతృఘ్న సిన్హా స్పష్టం చేశారు. ఎన్నికల్లో తాను ప్రచారం చేసి ఉంటే పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేదని మాత్రమే తాను అన్నానని చెప్పారు.
తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్నారు. ఎన్నికల ఫలితాలతో తాము ఆవేదనకు గురవుతున్నామని, అయితే బాధ్యతలకు దూరంగా మాత్రం పారిపోమని చెప్పారు. తాను రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం లేదని, ప్రజల అండదండలతో రెండుసార్లు భారీ మెజారిటీతో లోకసభకు ఎంపికయ్యానని శతృఘ్ను సిన్హా చెప్పారు.