మోడీ టార్గెట్: దర్శకుడి పైన శతృఘ్ను సిన్హా సీరియస్
ముంబై: ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ పైన బీజేపీ ఎంపీ శతృఘ్ను సిన్హా తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ పైన అనురాగ్ కశ్యప్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో శతృఘ్ను స్పందించారు. కరణ్ సినిమాకి, మోడీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు.
పాకిస్తాన్లో పర్యటించినందుకు మోడీ క్షమాపణ చెప్పాలని ఆయనను ప్రశ్నించే హక్కు తనకు ఉందని అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ నటుల సినిమాలు బ్యాన్ చేయాలని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన హెచ్చరికలు జారీ చేయడంతో కరణ్ జోహార్ తెరకెక్కించిన 'యే దిల్ హై ముష్కిల్' చిక్కుల్లో పడింది.
దీనిపై అనురాగ్ ఇటీవల స్పందించారు. కరణ్ జోహార్ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలోనే మోడీ పాకిస్తాన్ వెళ్లారని, అందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై శతృఘ్న తీవ్రంగా స్పందించారు.
తాను ఈ విషయంపై మాట్లాడే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నానని, తనకు అనురాగ్, అతని సోదరుడు అభినవ్ చాలా ఇష్టమని, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎంతో ఇష్టమని, గౌరవమని చెప్పారు. భారత్-పాక్ మధ్య శాంతి సామరస్యం నెలకొల్పడానికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రధాని మోడీని తక్కువ చేసి మాట్లాడటం సబబు కాదన్నారు. ఇప్పుడు మోడీని విమర్శిస్తున్న వారు రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలని, నిన్నటి ప్రాణ స్నేహితులు రేపు బద్ధ శత్రువులు కావొచ్చని, దేశమంతా అభినందించిన మోడీ పాక్ పర్యటనని రాజకీయం చేయవద్దన్నారు. అసలు కరణ్ సినిమాకి, మోడీ పాక్ పర్యటనకు, కరణ్కి అనురాగ్కి అసలు సంబంధం ఏమిటో నాకు తెలియడం లేదన్నారు.