బీజేపీని ఓడించండి: రెబల్ ఎంపీ శత్రుఘ్న సిన్హా షాకింగ్ కామెంట్స్
ముజఫర్నగర్: భారతీయ జనతా పార్టీ రెబల్ ఎంపీ శత్రుఘ్న సిన్హా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి సొంత పార్టీకి షాకిచ్చారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యంగా ఉండాలని సూచించారు. అంతేగాక, సొంత పార్టీ బీజేపీని ఓడించాలంటూ పిలుపునిచ్చారు.
'భారత ప్రభుత్వ ఇష్ట ప్రకారమే రిలయన్స్ను డసో.. తమ స్థానిక భాగస్వామిగా ఎంచుకుందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హోలాండే చెప్పినట్లు ఆ దేశ మీడియా ఇటీవల పేర్కొంది. యుద్ధ విమానాలను తయారు చేయడంలో చాలా అనుభవం ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) వంటి దేశీయ సంస్థను పక్కకు పెట్టి, డిఫెన్స్లో కొత్తదైన సంస్థను ఇందులో ఎందుకు భాగస్వామిని చేశారు?' అని సిన్హా ప్రశ్నించారు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని శత్రుఘ్న సిన్హా ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. '2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నేతలంతా ఏకమై బీజేపీని ఓడించాలి' అని ఆయన వ్యాఖ్యానించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో శత్రుఘ్న సిన్హా కూడా ఈ వివాదంపై ఆరోపణలు చేశారు.