కిరణ్ బేడీ కన్నా ఇల్మీ అందమైంది, సిఎం అభ్యర్థిగా అయితే..: కట్జు
న్యూఢిల్లీ: జస్టిస్ మార్కండేయ కట్జూ మరో వివాదాస్పదమైన వ్యాఖ్య చేశారు. గతంలో ఆయన బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ను రాష్ట్రపతిగా చేయాలని వ్యాఖ్యానించారు. బిజెపి నేత షజియా ఇల్మీ ఢిల్లీ బిజెపి అభ్యర్థి కిరణ్ బేడీ కన్నా అందమైందని భారత ప్రెస్ కౌన్సిల్ మాజీ చైర్మన్ అయిన కట్జూ వ్యాఖ్యానించారు. ట్విట్టర్లో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.
ఇల్మీని బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఉంటే ఆ పార్టీ కచ్చితంగా ఢిల్లీ ఎన్నికల్లో గెలిచి ఉండేదని అన్నారు. క్రోషియా ప్రెసిడెంట్ గ్రాబర్ కిటారోవిక్ను ప్రస్తావిస్తూ క్రోషియాలో మాదిరిగా ప్రజలు అందమైన ముఖాలకు ఓటు వేస్తారని, ఓటే వేయని తనలాంటివాడు కూడా షిజియాకు ఓటు వేస్తాడని అన్నారు.
ఆ వ్యాఖ్యలకు సోషల్ నెట్వర్కింగ్ సైట్లో తీవ్రమైన వ్యతిరేకత, విమర్శలు ఎదురు కావడంతో ఆయన వెనక్కి తగ్గారు. తాను ఆ వ్యాఖ్యలు సరదా కోసం చేశానని, వాటిని తీవ్రంగా తీసుకోవద్దని అన్నారు. హాస్యం కోసం ఆ వ్యాఖ్యలు చేసినట్లు మళ్లీ ట్వీట్ చేశారు.
తర్వాతి రాష్ట్రపతి కత్రినా కైఫ్ కావాలని గతంలో ఫేస్బుక్లో పోస్టు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సందర్భంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. క్రోషియా ప్రెసిడెంట్గా కోలిందా గ్రాబర్ కిటారోవిక్ ఎన్నిక తనకు స్ఫూర్తినిచ్చిందని, తాను అన్ని పదవులకు అందమైన మహిళలు ఎన్నిక కావాలని కోరుకుంటానని కట్జూ అప్పుడు బ్లాగ్లో రాశాడు. ఎందుకంటే రాజకీయ నాయకులు చంద్రుడిని తీసుకోస్తామని చెబుతారని, కానీ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోరని ఆయన అన్నారు. ఎవరో ఒకరు కావాలనుకున్నప్పుడు అందమైన మహిళలను ఎందుకు ఎన్నుకోగూడదని ఆయన అన్నారు.