తల్లిపై ఓ కొడుకు న్యాయపోరాటం: జీవితాన్ని నరకప్రాయం చేసిందని.. 1.5కోట్లు పరిహారానికి డిమాండ్..
తనకు రెండేళ్ల వయసున్నప్పుడు తన తల్లి తనను ముంబై నగరంలో వదిలేసి వెళ్లిపోవడంతో.. అత్యంత దుర్భర పరిస్థితుల్లో తన జీవితం గడిచిందని, ఆమె వల్లే తన జీవితం నాశనమైందని ఆరోపిస్తూ ఓ వ్యక్తి(40) ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన జీవితాన్ని నాశనం చేసినందుకు రూ.1.5కోట్లు తన తల్లి నుంచి పరిహారం వచ్చేలా చూడాలని పిటిషన్లో పేర్కొన్నాడు.
పిటిషన్లో పొందుపరిచిన వివరాల ప్రకారం.. ఆర్తి మస్కర్ అనే మహిళకు మొదట దీపక్ సబ్నిస్ అనే వ్యక్తితో వివాహమైంది. పుణేలో వీరు నివాసం ఉండేవారు. ఫిబ్రవరి,1979లో వీరికి ఓ కొడుకు పుట్టాడు. సినీ ఇండస్ట్రీలో పనిచేయాలన్న కోరికతో 1981లో ఆర్తి ముంబైకి వచ్చింది. రెండేళ్ల కొడుకును కూడా తన వెంటపెట్టుకుని వచ్చిన ఆమె... ముంబైలో ఓ రైల్లో బాబును వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఆ తర్వాత రైల్వే అధికారులు ఆ చిన్నారిని ప్రభుత్వ ఆధీనంలో నడిచే సంరక్షణ కేంద్రానికి తరలించారు.
ఇదే క్రమంలో 1986లో శ్రీకాంత్ సబ్నీస్ నానమ్మ ఎట్టకేలకు అతని ఆచూకీ కనుక్కొని, చట్టప్రకారం తిరిగి అతన్ని తన వద్దకు తీసుకొచ్చుకుంది. ఆపై తన మేనత్త వద్ద అతను పెరిగాడు. అలా ముంబై సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఓ మేకప్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో.. 2017లో శ్రీకాంత్కి తన సొంత తల్లి ఆచూకీ తెలిసింది. ఎట్టకేలకు ఆమె ఫోన్ నంబర్ సంపాదించి.. సెప్టెంబర్,2018లో ఆమెతో మాట్లాడాడు. ఆ సమయంలో ఆమె అతన్ని తన కొడుకే అని అంగీకరించింది. పరిస్థితుల కారణంగా అలా వదిలేయాల్సి వచ్చిందని తెలిపింది.
ఆ తర్వాత కొద్ది రోజులకు శ్రీకాంత్ తన తల్లిని ప్రత్యక్షంగా కలిశాడు. ఆ సమయంలో ఆమె రెండో భర్త కూడా అక్కడికి వచ్చాడు. నువ్వు నా కొడుకు అన్న విషయం ఎక్కడా ఎవరికీ చెప్పవద్దని శ్రీకాంత్ తల్లి అతన్ని కోరింది. అయితే అందుకు అతను ఒప్పుకోలేదు. దీనిపై కోర్టును ఆశ్రయించిన అతను.. తాను ఆర్తి మస్కర్ కొడుకునే అని ఆమెతో ప్రకటించాలని పిటిషన్లో పేర్కొన్నాడు. ఇన్నాళ్లు దుర్బర జీవితంతో మానసికంగా కుంగిపోయానని పేర్కొన్నాడు. ప్రభుత్వ సంరక్షణ కేంద్రం నుంచి బయటకొచ్చాక... తన నానమ్మ వద్దకు చేరేవరకు బిచ్చమెత్తుకుంటూ జీవించానని చెప్పాడు. తల్లిదండ్రులెవరో తెలియక నరకయాతన అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశాడు. రెండేళ్ల వయసులో తనను ముంబైలో వదిలేసి తన జీవితాన్ని నరకప్రాయం చేసిన తల్లి నుంచి రూ.1.5కోట్లు పరిహారం ఇప్పించాలని పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ కేసుపై జనవరి 13,2020న ముంబై హైకోర్టు న్యాయమూర్తి ఏకే మీనన్ విచారణ జరపనున్నారు.