కారు ఎందుకు తిరిగిచ్చావ్: అతనిని అడిగిన శశికళ, తిరిగొచ్చాడు
అన్నాడీఎంకే పార్టీలో కొత్త ట్విస్ట్. శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకించి, పార్టీకి గుడ్ బై చెప్పిన నాంజిల్ సంపత్ తిరిగి వచ్చారు.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో కొత్త ట్విస్ట్. శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకించి, పార్టీకి గుడ్ బై చెప్పిన నాంజిల్ సంపత్ తిరిగి వచ్చారు. ఆయన శనివారం నాడు శశికళతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన చిన్నమ్మ నాయకత్వానికి జై కొట్టారు.
జయ మృతి చెందిన నెల రోజుల తర్వాత..: హిస్టారికల్
నాంజిల్ సంపత్ పార్టీ ప్రచార ఉప కార్యదర్శి. శశికళ పగ్గాలు చేపట్టాక ఆయన పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. అనూహ్యంగా శనివారం చిన్నమ్మతో భేటీ అయ్యాక రివర్స్ గేర్ వేశారు. పార్టీ కోసం పని చేస్తానని ప్రకటించారు.
కారును తిరిగిచ్చేశాడు
సంపత్ జనవరి 3వ తేదీన పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, దివంగత జయలలిత తనకు ప్రచారం కోసం బహుమతిగా ఇచ్చిన కారును కూడా తిరిగి ఇచ్చేశారు.
శశికళతో భేటీ తర్వాత..
శశికళతో తాను భేటీ అయ్యానని, ఆమె పార్టీలో కొనసాగమని చెప్పారన్నారు. కారు తిరిగి ఎందుకు ఇచ్చావని ప్రశ్నించిందని చెప్పారు. అయితే, ఆ కారు ఇప్పుడు తనకు అవసరం లేదని చెప్పానని అన్నారు.
కారు తిరిగిస్తామని చెప్పారు
శశికళ మాత్రం తాను బాగా పని చేస్తున్నానని చెప్పిందని, అలాగే, కారును తిరిగి తనకు పంపించాలని కూడా భావించానని చెప్పిందన్నారు. కానీ ఇప్పుడు తాను స్వయంగా వచ్చినందున కారును తననే తీసుకు వెళ్లమని చెప్పిందన్నారు. పార్టీకి పని చేస్తానని తాను ఆమెతో అన్నానని తెలిపారు.
సంతృప్తి
శశికళను కలిసిన తర్వాత సంతృప్తిగా ఉందని, పార్టీ కోసం మళ్లీ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగనున్నానని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి శశికళ నాయకత్వానికి మద్దతుగా ప్రసంగిస్తానని, అన్నాడీఎంకే సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేస్తానని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నాడీఎంకే భారీ విజయాన్ని సాధించేలా కృషి చేస్తానని, కార్యకర్తలలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసేలా తన ప్రచార వ్యూహం ఉంటుందని తెలిపారు.
పార్టీ కోసం పని చేస్తా
జయలలిత మృతి తర్వాత ఒంటరిని అయినట్లు అనిపించిందని, ప్రజా జీవితం ఇక చాలనే నిర్ణయానికి వచ్చానని పేర్కొన్నారు. అయితే శశికళ తనను కలవాలని ఆహ్వానించారని, ఆ మేరకు ఆమెతో భేటీ అయ్యానని తెలిపారు. పార్టీలో తనకు గుర్తింపు ఎల్లప్పుడు ఉంటుందని, మళ్లీ ప్రచారంలో పాల్గొని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని శశికళ కోరారని పేర్కొన్నారు. ఆమె ఆదేశాల మేరకు మళ్లీ పార్టీలో ముమ్మరంగా పని చేయనున్నానని వివరించారు.
డీఎంకేలో పని చేసి..
సంపద్ 2012లో అన్నాడీఎంకేలో చేరారు. మంచి వక్త. అతను డీఎంకేలో తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించాడు. 1993లో వైకోతో పాటు బయటకు వెళ్లారు. ఆ తర్వాత 2012లో అన్నాడీఎంకేలో చేరారు.
విభేదాలు
జయలలిత మరణం తర్వాత పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న నాంజిల్ సంపత్ ఇటీవల తన చర్యలతో నాయకత్వంతో తనకు విభేదాలు ఉన్నట్లు పరోక్షంగా సంకేతాలు పంపారు. జయలలిత అందించిన వాహనాన్ని తన మిత్రుని ద్వారా కొద్ది రోజుల క్రితం అధిష్ఠానానికి ఇచ్చేయడంతో పాటు శశికళ నాయకత్వం గురించి ఆయన ఓ తమిళ టీవీ ఛానెల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అసహనం సైతం వ్యక్తం చేశారు.
అసహనం ఇలా..
శశికళ గురించి తనకు తెలియదని, ఆమెను ఎప్పుడూ కలవలేదని, ఆ అవకాశం కూడా తనకు రాలేదన్నారు. అంతేకాదు, సచివాలయంలో ఐటీ దాడుల పైన శశికళ, ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మాట్లాడక పోవడంపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు.