ఆమె ఇప్పటికీ హావాయ్ చెప్పులు వేసుకొంటుంది, కాటన్ చీరెలే కడుతోంది, నేను నేలపై పడుకొంటాను
కోల్ కతా :నేను నేలపై పడుకొంటాను, కాని, ఆమె చిన్న ఇంట్లో నివసిస్తారని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పెద్ద నగదు నోట్ల రద్దు నిర్ణయం పట్ల ఆమె సానుకూలంగానే ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
పెద్ద నగదు నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న వెంటనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీని కలిసి వినతి పత్రం సమర్పించారు. డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి ఆందోళన గళం విన్పించారు.కాంగ్రెస్ సహ ఇతర విపక్షాలుఇచ్చిన బంద్ లో పాల్గొనకపోయినా, అదే రోజు కోల్ కతా వీధుల్లో ఆమె పార్టీ కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.
బెంగాల్ లో చోటుచేసుకొన్న శారదా, నారద కుంభకోణాల్లో టిఎంసి నాయకులు, ప్రజా ప్రతిధుల పాత్ర ఉందని విపక్షాలు మమతపై విరుచుకుపడ్డాయి. ఈ కుంభకోణాల్లో పోగుచేసిన నగదును మార్చుకోవడం ఇబ్బందిగా మారడంతోనే ఆమె ఆందోళనలకు దిగిందని ఆ రాష్ట్రానికి చెందిన విపక్షాలు ఆమెపై విమర్శులు గుప్పించాయి.అయితే పెద్ద నగదు నోట్ల రద్దును మమత వ్యతిరేకించడం లేదని ప్రముఖ యోగా గురువు రాందావ్ బాబా చెప్పారు. ఈ నిర్ణయం అమలు చేసే విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పారు.
నల్లధనం వల్ల దేశంపై తీవ్రమైన చెడు ప్రభావం ఉంటుందనే విషయాన్ని మమత అంగీకరిస్తున్నారని ఆయన చెప్పారు. తమకు నచ్చన విషయాలపై మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆమె ఇప్పటికీ కూడ సాధారణ జీవితాన్నే గడుపుతారని ఆయన గుర్తు చేశారు. కాళ్ళకు ఇంకా హావాయి చెప్పులను మాత్రమేధరిస్తారని చెప్పారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆర్థిక పరిస్థితుల గురించి పెద్దగా అనుమానించాల్సిన అవసరం లేదన్నారు. మావోయిస్టులకు, ఉగ్రవాదులకు కూడ నల్లధనం వల్లే నిధులు అందుతున్నాయని, దీన్ని అరికట్టడం వల్ల దేశానికి ప్రయోజనం ఉంటుందన్నారు. పెద్ద నగదు నోట్ల రద్దు నిర్ణయాన్ని 2012 లోనే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని సమర్థించిందని ఆయన గుర్తు చేశారు.