లంచం వద్దన్నందుకే.. ఆమెను చంపేశా!: హిమాచల్ ఘటనపై నిందితుడు
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ కట్టడాల కూల్చివేతకు ఉపక్రమించిన అధికారిణి శైల్ బాలను విజయ్ సింగ్ అనే ఓ గెస్ట్ హౌజ్ యజమాని ఆమెపై కాల్పులు జరిపి హత్య చేసిన సంగతి తెలిసిందే. హత్య తర్వాత పరారైన అతన్ని ఎట్టకేలకు గురువారం సాయంత్రం అరెస్ట్ చేశారు పోలీసులు.
లంచం తీసుకోవడానికి నిరాకరించినందువల్లే శైల్ బాలను తాను హత్య చేసినట్టు విజయ్ సింగ్ పోలీసుల విచారణలో వెల్లడించడం గమనార్హం. గెస్ట్ హౌజ్ కూల్చివేయవద్దని ఆమెను బతిమాలుకున్నామని, తన తల్లి సైతం ఆమె కాళ్లపై పడి ప్రాధేయపడిందని విజయ్ సింగ్ చెప్పాడు. అయినప్పటికీ ఆమె కనికరించలేదని, పైగా తాను నిజాయితీగల అధికారిణి అని, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే తాను నడుచుకుంటున్నానని బాల చెప్పినట్టు పేర్కొన్నాడు.
శైల్ బాలపై కాల్పుల తర్వాత విజయ్ సింగ్ అటవీ ప్రాంతంలోకి పారిపోయాడు. కాల్పుల సందర్భంగా మరో వ్యక్తి కూడా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో విజయ్ సింగ్ పై రూ.1లక్ష రివార్డు కూడా ప్రకటించారు పోలీసులు. నిందితుడు ఉత్తరప్రదేశ్ లోని మథుర ప్రాంతంలో ఉన్నట్టు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించిన పోలీసులు ఎట్టకేలకు అతన్ని అరెస్ట్ చేశారు.
కాగా, సుప్రీం ఆదేశాల మేరకు మంగళవారం నాడు కసౌలీ పట్టణంలో అక్రమ కట్టడాలను కూల్చివేతకు వెళ్లారు శైల్ బాల. అక్రమంగా నిర్మించిన 13 హోటల్స్, రిసార్టులను కూల్చేందుకు వెళ్లిన తన టీమ్ తో కలిసి వెళ్లగా.. నారాయణి గెస్ట్ హౌజ్ యజమాని ఆమెను తుపాకీతో కాల్చి హత్య చేశాడు. గెస్ట్ హౌజ్ కూల్చవద్దని శైల్ బాలతో వాగ్వాదానికి దిగిన విజయ్ సింగ్.. తీవ్ర కోపోద్రిక్తుడై తుపాకీతో మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో బాల అక్కడిక్కడే మృతి చెందారు.
విజయ్ సింగ్ అరెస్టుకు ముందు అతని తల్లి ఘటనపై స్పందించారు. తన కుమారుడు తప్పు చేశాడని అంగీకరించారు. ఈ ఘటన నుంచి తేరుకోలేకపోతున్నానని, తన కుమారుడు లొంగిపోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. గెస్ట్ హౌజ్ కూల్చవద్దని అధికారులకు తాము ఎంత చెప్పినా వినలేదని, 2000వ సంవత్సరం నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నామని, పన్నులు చెల్లిస్తున్నామని చెప్పామన్నారు.
ఇక్కడే రెండస్థుల గెస్ట్ హౌజ్ నిర్మించి నడుపుతున్నామని, అది నిర్మిస్తున్నప్పుడు అధికారులెవరూ చట్టవిరుద్దమని చెప్పలేదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ అంతస్థులను కూల్చేస్తామని తన కుమారుడు అధికారులకు నచ్చజెప్పేందుకు విఫలయత్నం చేశాడని పేర్కొన్నారు. ఇప్పుడు తమ జీవితం నాశనమైపోయిందని చెప్పుకొచ్చారు.