షీనా హత్య: ఇంద్రాణి ఆత్మహత్యాయత్నం, సీరియస్
హైదరాబాద్: షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలై, స్వయానా ఆమె తల్లి అయిన ఇంద్రాణి ముఖార్జియా (43) శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న ఇంద్రాణి భారీ మోతాదులో ట్యాబ్లెట్లు మింగడంతో శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఆమెను హుటాహుటిన జేజే ఆస్పత్రికి తరలించారు.
ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెప్పారు. శుక్రవారం ఉదయం నుంచి జేజే ఆస్పత్రిలో ఇంద్రాణికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇంద్రాణికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని, మరో మూడు రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు.
ఇంద్రాణి మత్తుమందులు అధికంగా వాడినట్లు వైద్యులు తెలిపారు. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ దర్యాప్తునకు ఆదేశించారు.సాయంత్రం వరకు కూడా ఇంద్రాణి ముఖార్జియా స్పృహలోకి రాలేదని తెలుస్తోంది. డిప్రెషన్ను అధిగమించడానికి వాడే గుళికలను ఆమె ఎక్కువ మోతాదులో తీసుకుందని వైద్యులు అంటున్నారు.
జైలు అధికారులను ఇచ్చిన గుళికలను ఆమె నిలువ చేసుకుని మింగి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె శరీరంలోంచి సాంపిల్స్ తీసి పరీక్షలకు పంపిస్తామని చెప్పారు. ఎపిలప్సీ గుళికలు ఆమె వద్ద ఉండి ఉంటాయని, వాటిని ఆమె ఒకేసారి మింగి ఉంటుందని జెజె ఆస్పత్రి డీన్ టిపి లహనే అంటున్నారు.