'షీనా అమెరికా వజ్రాలవ్యాపారిని పెళ్లాడింది'
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మరో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. షీనా బోరా ఓ అమెరికా వజ్రాల వ్యాపారిని పెళ్లి చేసుకుందని ఇంద్రాణి ముఖర్జియా కూతురు విధి తెలిపింది. సీబీఐ అధికారులు విధిని విచారించిన సందర్భంగా ఆమె ఈ విషయం వెల్లడించారు. 2012లో షీనా కనిపించకుండా పోయినపుడు షీనా ఎక్కడికెళ్లారని తాను అడిగితే ఇంద్రాణి కోపగించుకునేదని విధి వివరించారు.
తర్వాత మరోసారి అడిగితే అమెరికాలో ఓ వజ్రాల వ్యాపారిని ఆమె వివాహం చేసుకుందని చెప్పేదని చెప్పారు. 2009లో షీనా తన సోదరి అని ఇంద్రాణి తనకు పరిచయం చేసిన విషయాన్ని విధి గుర్తు చేశారు. షీనా, రాహుల్ల ప్రేమ వ్యవహారం ఇంద్రాణి, పీటర్లకు అసలే నచ్చేది కాదని చెప్పారు.
షీనా ఇంద్రాణి సోదరి కాదని, కూతురు అనే విషయం 2009 - 10 మధ్యలో తనకు తెలిసిందని విధి సిబిఐకి చెంప్పింది. ఇదే విషయాన్ని ఇంద్రాణిని అడిగితే అదంతా అబద్ధమని చెప్పేదని, రాహుల్ తన మీది కోపంతో అలా చెబుతున్నాడని అనేదని ఆమె వివరించింది.
2012లో షీనా కనిపించకుండా పోయిన తర్వాత తనకు వేరే ఈ మెయిల్ అడ్రస్ నుంచి మెయిల్స్ వచ్చేవని చెప్పింది. ఇంద్రాణియే షీనా పేరుతో వేరే మెయిల్ ఐడి రూపొందించినట్లు, దాని ద్వారా మెయిల్స్ పంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. విధి చెప్పిన విషయాలను సిబిఐ అధికారులు రికార్డు చేశారు.
కాగా, షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణిని, ఆమె భర్త పీటర్ ముఖర్జియా, మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యాంరాయ్లను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. సీబీఐ విచారణ జరుపుతోంది.ఇంద్రాణి ప్రస్తుత భర్త పీటర్ ముఖార్జియాను కూడా పోలీసులు అరెస్టు చేశారు.