షీనా హత్య కేసు: ఇంద్రాణికి బ్రిటిష్ సాయం
ముంబై: షీనా బొరా హత్య కేసులో నిందితురాలు ఇంద్రాణి ముఖార్జియాకు న్యాయ సహాయం అందించడానికి బ్రిటిష్ కాన్సులేట్ అధికారులు ముందుకు వచ్చారు. ఇంద్రాణి ముఖార్జియాను కలవడానికి తమకు అనుమతి ఇవ్వాలని బ్రిటిష్ కాన్సులేట్ అధికారులు మధ్య ముంబైలోని బైకుల్లా మహిళా జిల్లా జైలు అధికారులను అడిగారు.
న్యాయ సహాయం ఏమైనా అవసరమేమో కనుక్కోవడానికి తాము ఇంద్రాణిని కలవాలని అనుకుంటున్నట్లు వారు తెలిపారు. ఇంద్రాణి ముఖార్జియాకు యుకె పాస్పోర్టు ఉండడంతో పాటు ఆమె బ్రిటిష్ జాతీయురాలు. బాంద్రా కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన తర్వాత ఇంద్రాణిని బైకుల్లా మహిళా జిల్లా జైలుకు తరలించారు.
అయితే, ఇంద్రాణిని కలవడానికి కేంద్రం నుంచి రాతపూర్వక అనుమతి తేవాలని జిల్లా అధికారులు బ్రిటిష్ కాన్సులేట్ అధికారులకు చెప్పారు. నిబంధనల మేరకు జైలులో ఉన్న తమ దేశస్థులను కలవడానికి కాన్సులేట్ అధికారులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని విదేశీ విభాగం అనుమతి పొందాల్సి ఉంటుంది.
షీనా బొరాను హత్య చేసిన కేసులో ఖార్ పోలీసులు ఇంద్రాణి ముఖార్జియాతో పాటు ఆమె రెండో భర్త సంజీవ్ ఖన్నాను, డ్రైవర్ శ్యామ్ రాయ్ని అరెస్టు చేశారు. తమ కస్టడీలోకి తీసుకుని ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఇంద్రాణి తన నేరాన్ని అంగీకరించినట్లు చెబుతున్నారు.