నాకు ప్రాణ హాని ఉంది: ఇంద్రాణి ముఖార్జియా
న్యూఢిల్లీ: షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలిగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియా తన ప్రాణాలకు హాని ఉందంటూ సోమవారం న్యాయస్థానం ముందు తెలిపింది. ' నాకు ప్రాణగండం ఉంది. నన్ను చంపడానికి నేనున్న జైల్లో కుట్ర జరుగుతోంది' అని ఇంద్రాణి ఆరోపించింది.
అంతేగాక, 'నాకిచ్చే ఆహారం కూడా బాగాలేదు. అందువల్లే నేను ఆసుపత్రి పాలవ్వాల్సి వచ్చింది. నన్ను ఎవరితోనూ మాట్లాడించడం లేదు. నేను చెప్పేది ఎవరూ పట్టించుకోవట్లేదు. దీనివెనక ఎవరో ఉన్నారు. నన్ను చంపించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు' అని ఇంద్రాణి అన్నారు.
అయితే ఈమె కొద్దిరోజుల క్రితం ఆసుపత్రి పాలైంది. కోర్టుకు హాజరైన సమయంలో ఆమె మోతాదుకు మించి మందులు తీసుకుందని వార్తలు వినిపించాయి. రెండు వారాల పాటు జేజే ఆసుపత్రిలోని వైద్యుల పర్యవేక్షణలో ఉంచిన ఈమెను తిరిగి జైలుకు తరలించారు.
కాగా, 2012లో ఆమె తన కూతురు 24ఏళ్ల షీనా బోరాను హత్యచేసి శవాన్ని మాయం చేశారు. ఈ కేసులో ఇంద్రాణితో సహా మరో ముగ్గురు వ్యక్తులు కూడా కారాగారశిక్ష అనుభవిస్తున్నారు.ఇందులో ఈమె ప్రధాన నిందితురాలిగా ఉన్నారు.