కూతుర్ని చంపి, పేదాలకు లిప్స్టిక్ పూసింది: షీనా హత్యకేసులో ఇంద్రాణిపై డ్రైవర్ సంచలనం
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది.
ముంబై: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. షీనాబోరా మృతదేహానికి ఇంద్రాణి లిప్స్టిక్ రాసి ఆపై తగలబెట్టారని ప్రధాన సాక్షిగా ఉన్న ఇంద్రాణి కారు డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ చెప్పాడు. ముంబై కోర్టుకు హాజరైన రాయ్.. షీనాబోరాను ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలిసి హత్య చేశారని కోర్టుకు చెప్పాడు.
'ఇంద్రాణి మేడమ్, ఆమె మాజీ భర్త సంజయ్ ఖన్నా, షీనాబోరాతో కలిసి కారులో బంద్రా నుంచి వెళ్తున్నాం. ఓ చోట ఇంద్రాణి మేడమ్ కారు ఆపమని చెప్పారు. వెంటనే షీనా నోరు మూయమని నాకు చెప్పారు. సంజయ్ఖన్నా షీనా జట్టుపట్టుకోగా.. ఇంద్రాణి మేడమ్ రెండు చేతులతో ఆమెను గొంతునులిమి చంపారు' అని డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ తెలిపాడు.
'ఆ తర్వాత ఇంద్రాణి మేడమ్, సంజయ్ ఇద్దరూ ఇంగ్లీష్లో ఏదో మాట్లాడుకున్నారు. పాలి హిల్కు కారు తీసుకెళ్లమని చెప్పారు. షీనాబోరా మృతదేహాన్ని ఓ బ్యాగులో పెట్టి చుట్టేయమన్నారు. దారిలో 20లీటర్ల పెట్రోల్ క్యాన్ వెంట తీసుకెళ్లాం. షీనాబోరా మృతదేహానికి ఇంద్రాణి మేడమ్ లిప్స్టిక్ వేసి, జట్టు సరిచేశారు. తర్వాత ఆమె శవంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు' అని రాయ్ తెలిపాడు.
ఈ విషయాన్ని బయట ఎక్కడ చెప్పొద్దని.. చెబితే సమస్యలు వస్తాయని మేడమ్ తనతో చెప్పినట్లు రాయ్ కోర్టుకు తెలిపాడు. కాగా, 2012 ఏప్రిల్లో షీనాబోరా హత్య జరగ్గా.. 2015లో రాయ్ను పోలీసులు అరెస్టు చేయడంతో ఈ కేసు వివరాలు బయటికి వచ్చాయి. షీనాబోరా హత్యకేసులో రాయ్ ప్రధాన సాక్షిగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ హత్యకేసులోనే ఇంద్రాణి ముఖర్జీ, సంజయ్ ఖన్నా జైలు జీవితం గడుపుతున్నారు.