క్వారంటైన్ లో గొర్రెలు, మేకలు ... టెన్షన్ లో ప్రజలు .. రీజన్ ఇదే !!
భారతదేశంలో రోజురోజుకుకరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎక్కడ ఎవరికి కరోనా పాజిటివ్ నమోదైనా ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఒక గొర్రెల కాపరికి కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో అతని వద్ద ఉన్న సుమారు యాభై మేకలు, గొర్రెలను క్వారంటైన్ లో ఉంచినట్లుగా సమాచారం.
కరోనా మందుపై యూటర్న్ తీసుకున్న పతంజలి ... ఆ నోటీసుకు ఆసక్తికర సమాధానం
శ్వాసకోశ సమస్యలతో గొర్రెలు , మేకలు
కర్ణాటక రాష్ట్రంలో తుమకూరు జిల్లా గొల్లర హట్టి తాలూకాలోని గొడెకెరె గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఒక గొర్రెల కాపరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే ఆ గొర్రెల కాపరి వద్ద ఉన్న గొర్రెలు ,మేకలు కూడా శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు గమనించిన గ్రామస్తులు భయభ్రాంతులకు గురై జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే విషయాన్ని కర్ణాటక న్యాయశాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు.దీంతో ఆయన పశుసంవర్ధక శాఖ అధికారులను అప్రమత్తం చేసి గొర్రెలు, మేకల పరిస్థితి పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ఆదేశించారు.
నమూనాలు సేకరించి ల్యాబ్స్ కు పంపిన అధికారులు
రంగంలోకి దిగిన అధికారులు గొర్రెలు ,మేకల నుండి నమూనాలను సేకరించారు. వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్ లకు పంపించారు. అయితే ఈ గొర్రెలు, మేకలు ప్లేగు లేదా మైకో ప్లాస్మా ఇన్ఫెక్షన్ గా పిలువబడే పెస్టే డెస్ పెటిట్స్ రూమినెంట్స్ (పిపిఆర్) తో బాధపడుతున్నాయని పశువైద్య నిపుణులు అనుమానిస్తున్నారు.ఇక మేకలు గొర్రెలు నుండి సేకరించిన నమూనాలను భోపాల్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ హెల్త్ అండ్ వెటర్నరీ బయోలాజికల్స్, వెటర్నరీ లాబొరేటరీకి పంపినట్లుగా పశుసంవర్ధక శాఖ అధికారి తెలిపారు.
గొర్రెల కాపరికి కరోనా రావటంతో వాటికి కూడా కరోనా అని అనుమానం
గొర్రెల కాపరి పెంచిన గొర్రెలు మేకలలో కొన్ని శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో, గొర్రెల కాపరికి కరోనా పాజిటివ్ రావడంతో వాటికి కూడా కరోనా వచ్చిందని ప్రజలు భయపడుతున్నారని పశు వైద్య అధికారులు అంటున్నారు.రాష్ట్రంలో ఇప్పుడు ప్రతిచోటా కరోనా భయం ఉన్న కారణంగా ప్రజల్లో భయాలు ఉండటం సహజమేనని వారంటున్నారు.
Recommended Video
గొర్రెలు, మేకలను క్వారంటైన్ లో ఉంచటానికి రీజన్ ఇదే
కరోనావైరస్ గొర్రెలకు ,మేకలకు సంక్రమించే అవకాశం లేదని, కాకుంటే పి పి ఆర్, మైకో ప్లాస్మా కూడా అంటువ్యాధులని, అవి ఇతర మేకలకు గొర్రెలకు సంక్రమించకుండా ఉండేందుకు వాటిని వేరు చేసి క్వారంటైన్ లో ఉంచామని అధికారులు చెబుతున్నారు. కానీ ప్రజలు మాత్రం గొర్రెలు, మేకలు కూడా కరోనాతోనే బాధ పడుతున్నాయని తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ఇక గొర్రెలకు , మేకలకు కరోనా వచ్చిందన్న ప్రచారం అక్కడ జోరుగా సాగుతోంది.