షీలాదీక్షిత్ హయాంలోనే ఢిల్లీ కొత్త అందం:తలమానికంగా మెట్రో రైలు
ఢిల్లీ: ఢిల్లీకి ముఖ్యమంత్రిగా మూడుసార్లు సేవలందించిన షీలా దీక్షిత్ శనివారం రోజున తుదిశ్వాస విడిచారు. ఇక ఆమె హయాంలో ఢిల్లీ రాష్ట్రం రూపు రేఖలు మారిపోయాయి. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఢిల్లీ నగరంలో జరిగాయి. అందులో ఒకటి ఢిల్లీ నగరానికి తలమానికంగా నిలిచిన మెట్రో ఒకటి. 2002లో కేవలం 8 కిలోమీటర్లతో మెట్రో ప్రారంభమైంది. అయితే ఈ 17 ఏళ్లలో ఢిల్లీ అంటే మెట్రో మెట్రో అంటే ఢిల్లీ అన్నంతగా మారిపోయింది. దీని వెనక షీలాదీక్షిత్ కృషి ఉందన్న సంగతి మరవరాదు.
2002లో 8 కిలోమీటర్లతో ప్రారంభమైన ఢిల్లీ మెట్రో
ఒక్క మెట్రోనే కాదు... ఢిల్లీకి తొలిసారి వచ్చిన ఎవరైనా సరే... ఆ నగరంలోని ఫ్లై ఓవర్లపై వెళ్లక మానరు.ఢిల్లీ నగరంలో ఎటు చూసిన అందమైన ఫ్లైఓవర్లే కనిపిస్తాయి. గత 20 ఏళ్లలో చాలా ఫ్లై ఓవర్లు నిర్మించబడ్డాయంటే అందుకు కారణం ఆ నాటి దివంగత మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అభివృద్ధిలో భాగంగా వేసిన ముందడుగే అని చెప్పక తప్పదు. ఇవన్నీ షీలా దీక్షిత్ 15 ఏళ్ల పాలనలో ప్రారంభమై ముగిసినవే. 2002లో ఢిల్లీ మెట్రో ప్రారంభమైంది. ఈ రోజున అది ప్రపంచంలోనే అత్యధిక ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్న రికార్డును సొంతం చేసుకుంది. గురుగ్రామ్ నుంచి నోయిడా, ఫరీదాబాద్ నుంచి ఘజియాబాద్ వరకు మొత్తం 300 కిలోమీటర్లను మెట్రో రైలు కవర్ చేస్తోంది.
షీలా దీక్షిత్ ప్రస్థానం..చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీతోనే...!
నేడు 250 పైచిలుకు స్టేషన్లతో 300 కి.మీ మేరా ఢిల్లీ మెట్రో
మొత్తం 250 పైచిలుకు స్టేషన్లు, ఎనిమిది లైన్లతో దేశంలో నే అత్యంత రద్దీ ఉన్న మెట్రోగా ఢిల్లీ మెట్రో గుర్తింపు పొందింది. కోల్కతా మెట్రో తర్వాత ఢిల్లీ మెట్రో ప్రారంభమైంది. అయితే ఢిల్లీ మెట్రో ఈ రోజున ఓ కీర్తి సాధించిందంటే అందుకు కారణం షీలా దీక్షిత్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీ రూపు రేఖలను మార్చిన ధీశాలి షీలా దీక్షిత్ అని కొనియాడారు. ఇక ఆ తర్వాత ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ ప్రస్థానం ముగిసింది. ముఖ్యమంత్రిగా తన 15 ఏళ్ల పాలనలో ఢిల్లీ అభివృద్ధి ఉరకలు పెట్టిందన్నారు. ఇటు మానవవనరుల రంగంలో అటు సామాజికంగాను ఢిల్లీలో అభివృద్ధి స్పష్టంగా కనిపించిందని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో మొత్తం 130 ఫ్లైఓవర్లు, మెట్రో రైలు, ఢిల్లీ వాసుల కోసం అధిక సంఖ్యలో బస్సులు తీసుకొచ్చిన ఘనత షీలా దీక్షిత్దే అని చెప్పారు రాహుల్ గాంధీ.
సీఎన్జీ బస్సులను ప్రవేశపెట్టి కాలుష్యానికి చెక్ పెట్టిన షీలా దీక్షిత్
ఇక ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతుండటంతో ఆమె సీఎన్జీ బస్సులను ప్రవేశపెట్టారు. సీఎన్జీ బస్సలు ప్రవేశపెట్టడంపై విపక్షాలు నోటికి పనిచెప్పినా.. వారి మాటలను పట్టించుకోకుండా కాలుష్య కోరల్లో చిక్కుకున్న ప్రజలకు కొంతలో కొంతైనా ఉపశమనం లభిస్తుందని ఆలోచించారు. దీంతో ఢిల్లీ రవాణా రంగంలో పెను మార్పులు కనిపించాయి. ఇక ఢిల్లీ మెట్రోకు విత్తనం మదన్లాల్ ఖురానా హయాంలో పడినప్పటికీ... షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ప్రాజెక్టు పరుగులు తీసింది. 2011లో గ్రీన్ హౌజ్ గ్యాస్ ఎమిషన్ను తగ్గించడంలో తొలి రైలు నెట్వర్క్ డిల్లీ మెట్రోనే అని ఐక్యరాజ్యసమితి సైతం ప్రశంసించిందంటే ఇందుకు కారణం షీలా దీక్షిత్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.