పులి కడుపున పులి పుట్టదా..? తూర్పున మరో వారసత్వ సూరీడు..
జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి హేమంత్ సొరెన్ పేరు దేశవ్యాప్తంగా మారు మోగుతూనే ఉంది. వారసత్వ రాజకీయాల నుంచే వచ్చినప్పటికీ తండ్రి ఇమేజ్పై ఆధారపడకుండా హేమంత్ సొరెన్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను ఏర్పరుచుకున్నారు. తండ్రి శిబు సోరెన్ ఉద్యమ నేపథ్యం ఆయన్ను ప్రజా నేతగా నిలబెట్టగా.. సొరెన్ రాజకీయ చతురత ఆయన్ను నాయకుడిగా నిలబెట్టింది. అందుకే గిరిజన మెజారిటీ ఉన్న జార్ఖండ్లో సొరెన్ గిరిజనేతరుల మనసులు కూడా గెలుచుకున్నారు.
పులి కడుపున పులి పుట్టదా..?
ఝార్ఖండ్ ఫలితాలు వెలువడ్డ అనంతరం మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు హేమంత్ తనదైన శైలిలో బదులిచ్చారు. వారసత్వ పరంపరలో భాగంగానే మీరిప్పుడు సీఎం కాబోతున్నారా..? అన్న ప్రశ్నకు 'పులి కడుపున పులి పుట్టకుండా ఉంటుందా..?' అని వ్యాఖ్యానించారు. అంతేకాదు,ఓ చమారీ(చెప్పులు కుట్టే వ్యక్తి) కొడుకు చమారీ అయితే ఇబ్బంది ఏంటి? అని ప్రశ్నించారు.
హేమంత్ తదుపరి అడుగులు :
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఎలాంటి ఆలోచనలు,పథకాలతో ముందుకెళ్లబోతున్నారన్న ప్రశ్నకు హేమంత్ ఆసక్తికర సమాధానం చెప్పారు. ముఖ్యమంత్రి హోదా చేపట్టి.. ముందు ఇది చేస్తా.. అది చేస్తా.. అని చెప్పడం సరికాదన్నారు. అది ప్రజలను వెర్రివాళ్లను చేయడమేనన్నారు. ముఖ్యమంత్రిగా విశాల దృక్పథంతో పనిచేయాల్సిన అవసరముందని,ఝార్ఖండ్లో ప్రతీ ప్రజా సమస్యను పరిష్కరించే దిశగా పనిచేస్తానని చెప్పారు.
తూర్పున మరో వారసత్వ సూర్యుడు
జార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్ కూటమి గెలుపుతో రెండోసారి ముఖ్యమంత్రిగా గెలుపొందిన హేమంత్ సొరెన్ను తూర్పున ఉదయించిన మరో వారసత్వ సూరీడిగా అభివర్ణిస్తున్నారు. వారసత్వం అన్న మాటను హేమంత్ అంగీకరించనప్పటికీ.. తండ్రి ఉద్యమ నేపథ్యం,ప్రజా పలుకుబడి హేమంత్కు కలిసొచ్చిందని చెప్పడంలో అనుమానాలు అక్కర్లేదు. అయితే 2014లో పార్టీ తరుపున ప్రధాన క్యాంపెయినర్గా ప్రచారం మొదలుపెట్టినప్పుడే.. తండ్రి నీడ నుంచి బయటపడేందుకు హేమంత్ తనదైన పాలిటిక్స్ చేయడం మొదలుపెట్టారు.
అప్పటివరకు సీన్లో లేని హేమంత్ సొరెన్..
నిజానికి తన రాజకీయ వారసుడిగా పెద్ద కుమారుడు దుర్గా సొరెన్ కొనసాగాలని శిబు సొరెన్ భావించారు. అందుకు తగ్గట్టే పార్టీలో దుర్గా సొరెన్కు పెద్ద పీట వేశారు. 1995లో జామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దుర్గా సొరెన్ గెలిచారు. అయితే 39 ఏళ్ల వయసులో దుర్గా సొరెన్ మరణించడం శిబు సొరెన్ ఆలోచనలను తలకిందులు చేసింది. దీంతో రెండో కుమారుడు హేమంత్ సొరెన్ను ఆయన తెర మీదకు తెచ్చారు.
హేమంత్ సొరెన్ రాజకీయం :
ఉమ్మడి బీహార్ రాష్ట్రంలో జన్మించిన హేమంత్ సొరెన్ పాట్నాలో పాఠశాల విద్యను అభ్యసించారు. అనంతరం ఇంటర్మీడియట్ పూర్తి చేసి రాంచీలోని బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అడ్మిషన్ తీసుకున్నారు. అయితే కోర్సు మాత్రం పూర్తి చేయలేకపోయారు. తన అత్యధిక విద్యార్హత ఇంటర్మీడియట్ అని నామినేషన్ పత్రాల్లో హేమంత్ పేర్కొనడంతో ఈ విషయం వెల్లడైంది. అన్న చనిపోయిన నెల రోజులకే రాజకీయాల్లోకి వచ్చిన హేమంత్ సొరెన్ జూన్,2009లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.
జనవరి,2010 వరకు రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగారు. తదనంతర పరిణామాల్లో రాజ్యసభకు రాజీనామా చేసి అర్జున్ ముండా ప్రభుత్వంలో జార్ఖండ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కానీ రెండేళ్లకే జేఎంఎం-బీజేపీ సంకీర్ణ సర్కార్ కూలిపోవడంతో ఆర్నెళ్ల పాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పలేదు. ఆ తర్వాత 2013లో ఆర్జేడీ-కాంగ్రెస్-జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కేవలం ఒకటిన్నర ఏడాది మాత్రమే ఆ పదవిలో కొనసాగారు.
ప్రతిపక్ష నాయకుడిగా :
2014లో పార్టీ ఓటమి నాయకుడిగా హేమంత్ సొరెన్ తానేంటో నిరూపించుకోవడానికి అవకాశం కల్పించినట్టయింది. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై పోరాడటంలో ఆయన తనదైన మార్క్ చూపించారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు. గతంలో ఏడాదిన్నర పాటే సీఎంగా చేసినప్పటికీ.. మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 50శాతం రిజర్వేషన్స్ అమలు, మావోయిస్టు కార్యకలాపాలను అణచివేయడంలో ఆయన సఫలమయ్యారు. తాజా ఎన్నికల్లో మద్యపాన నిషేధ హామీ, గిరిజన అనుకూల చట్టాలు, తాత్కాలిక ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్ అంశాలు కూడా ఆయనకు కలిసొచ్చాయి. గిరిజన నేపథ్యం నుంచే వచ్చినప్పటికీ అన్ని వర్గాల ప్రజలకు చేరువవడంలో హేమంత్ విజయం సాధించారు. మొత్తం మీద వచ్చే ఐదేళ్లలో హేమంత్ సొరెన్ పాలనాదక్షత ఎలా ఉంటుందన్న దాని పైనే భవిష్యత్లో ఆయన మరింత బలమైన నేతగా ఎదిగే అవకాశాలు ఆధారపడి ఉంటాయి.