నాకు సోదరి వంటిది: చున్నీ ఇష్యూపై సిద్ధూ, ఆయన బెస్ట్ సీఎం... నాదే తప్పు: బాధితురాలు
బెంగళూరు: మైక్ను లాక్కోబోయి మహిళ చున్నీ లాగిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఘటనపై ఆ తర్వాత స్పందించారు. బాధితురాలు తనకు సోదరితో సమానమని చెప్పారు. అది అనుకోకుండా జరిగిందని తెలిపారు.
చదవండి: అందరి ముందు మహిళ చున్నీ లాగేశాడు!: మాజీ సీఎం సిద్ధరామయ్య దురుసు (వీడియో)
తమ పార్టీ కార్యకర్త అయిన ఆమె చాలా సేపు ఆపకుండా మాట్లాడారని, దాంతో తాను అడ్డుకోవాలని చూశానని, దీంతో ఈ ఘటన చోటుచేసుకుందని సిద్ధరామయ్య చెప్పారు. ఇది అనుకోకుండా జరిగిందన్నారు. ఇందులో ఎటువంటి చెడు ఉద్దేశం లేదని తెలిపారు. ఆమె తనకు పదిహేనేళ్లుగా తెలుసునని, ఆమె తన సోదరి వంటిదని చెప్పారు.
సిద్ధరామయ్య తీరుపై బాధితురాలు (జమాలా) స్పందిస్తూ.. తనకు ఈ ఘటనపై తనకు ఎటువంటి అభ్యంతరాలు లేవన్నారు. ఆయన గతంలో ఓ గొప్ప ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించారని, తాను ఓ విషయంలో ఆవేదనకు గురయ్యానని, ఆయన ముందు దురుసుగా మాట్లాడానని, ఓ మాజీ ముఖ్యమంత్రితో తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదని చెప్పారు. ఆయన ముందు ఉన్న బల్లను తాను చేతితో కొట్టినందుకే ఆయనకు తనపై కోపం వచ్చిందన్నారు.
కాగా, మైసూరులో జరిగిన కార్యక్రమంలో జమాలా అనే ఓ మహిళ మాట్లాడిన తీరుపై ఆగ్రహానికి గురైన సిద్ధరామయ్య ఆమె వద్ద ఉన్న మైక్ను లాక్కున్నారు. ఈ సమయంలో ఆ మహిళ చున్నీ కూడా వచ్చింది. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి.
సిద్ధరామయ్య ప్రవర్తనపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించి, దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ డిమాండ్ చేశారు. ఆమెపై సిద్ధరామయ్య ప్రవర్తించిన తీరు నేరపూరిత చర్య అన్నారు. మహిళలపై కాంగ్రెస్ నేతల తీరు ఇలా ఉంటుందని మండిపడ్డారు. ఓ కుటుంబానికి చెందిన మహిళలను మాత్రమే వారు గౌరవిస్తారని, గాంధీ-నెహ్రూ కుటుంబాన్ని ఉద్దేశించి అన్నారు.