జకీర్ని చంపితే రూ.15లక్షల రివార్డు: హుస్సేనీ టైగర్స్
లక్నో: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్కు అన్ని దారులు మూసుకుపోయేలా కనిపిస్తున్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హుస్సేనీ టైగర్స్ అనే బృందం.. జకీర్ను చంపితే రూ.15లక్షలు రివార్డుగా ఇస్తామని ప్రకటించింది.
ఢాకా ఉగ్రదాడికి స్ఫూర్తి!: డాక్టర్ నుంచి మత బోధకుడిగా, ఎవరీ జకీర్ నాయక్?
ఆ బృందం అధ్యక్షుడు సయ్యద్ కల్బే హుస్సేన్ నఖ్వీ మాట్లాడుతూ.. 'అతడు(జకీర్) నాయక్ కాదు.. ఖల్నాయక్(ఒక విలన్'. ఇస్లాం మత ప్రవక్తను అవమానిస్తున్నాడు. అతడ్ని చంపిన వారికి నగదు బహుమతి అందిస్తాం. అతడొక కాఫిర్' అని పేర్కొన్నారు.
ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ కల్బె సాదిఖ్ కుమారుడే హుస్సేన్ నఖ్వీ. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి అనంతరం జకీర్ నాయక్ ప్రసంగాలపై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.
ఉగ్రవాదుల్లో ఒకరు జకీర్ ప్రసంగాలతో స్ఫూర్తి పొందినట్లు వార్తలు రావడమే అందుకు కారణం. దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం జకీర్ ప్రసంగాలను ప్రసారం చేసే టీవీ ఛానెల్ను నిషేధించింది. భారత ప్రభుత్వంతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా జకీర్ ప్రసంగాలపై దర్యాప్తు జరుపుతోంది.