వాట్సాప్ నుంచి వేరే యాప్కి షిఫ్ట్ అయినా... సేమ్ గ్రూప్స్ను ఎలా పొందవచ్చో తెలుసా... ఇదిగో ఇలా..
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ అనుబంధ మేసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రకటించిన కొత్త ప్రైవసీ పాలసీపై యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వాట్సాప్ పనిచేసేది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ విధానంలోనే అయినప్పటికీ కొత్త ప్రైవసీ పాలసీతో యూజర్ ప్రైవసీపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆటోమేటిక్ డేటా యాక్సెస్ని వాట్సాప్ ప్రైవసీ పాలసీలో పొందుపరచడంతో ఇక వాట్సాప్లో మెసేజింగ్ అంత సేఫ్ కాదని చాలామంది భావిస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారాలకు సంబంధించిన సున్నితమైన,కీలకమైన సమాచారాన్ని వాట్సాప్ ద్వారా షేర్ చేయడం సురక్షితం కాదని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పలువురు వ్యాపార దిగ్గజాలు వాట్సాప్కు గుడ్ బై చెప్పి వేరే మెసేజింగ్ యాప్స్కు షిఫ్ట్ అవుతున్నారు. ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్ మస్క్,పేటీఎం సీఈవో విజయశేఖర్ శర్మ ఇప్పటికే వాట్సాప్ను వీడి సిగ్నల్ యాప్లో చేరారు. టాటా స్టీల్ కంపెనీ లాంటి ప్రముఖ సంస్థలు కూడా తమ సిబ్బందిని వాట్సాప్లో సున్నితమైన సమాచారాన్ని షేర్ చేయవద్దని సూచనలు జారీ చేశాయి.
వాట్సాప్ నుంచి వేరే యాప్కి షిఫ్ట్ అవాలనుకునే యూజర్లను ఒక సమస్య వేధిస్తోంది. కొత్త యాప్లో మళ్లీ గ్రూప్స్ క్రియేట్ చేయడం పెద్ద టాస్క్గా చాలామంది భావిస్తుంటారు. అయితే సిగ్నల్ యాప్ రూపంలో ఇందుకు సింపుల్ సొల్యూషన్ ఉంది. వాట్సాప్లో ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో... అవే గ్రూప్స్ను మీరు సిగ్నల్ యాప్లో పొందవచ్చు. ఇందుకోసం ఈ కింద సూచించిన సూచనలను పాటించాల్సి ఉంటుంది.
step 1 : సిగ్నల్ యాప్లో ఏదైనా ఒక నంబర్ను యాడ్ చేసి మొదట ఒక గ్రూప్ క్రియేట్ చేయండి.
step 2 : గ్రూప్ సెట్టింగ్ ట్యాబ్పై క్లిక్ చేసి గ్రూప్ లింక్ ఆప్షన్ ఎంచుకోవాలి. గ్రూప్ లింక్ ఆప్షన్ను ఆన్ చేయడం ద్వారా ఇన్వైట్ లింక్ను పొందవచ్చు.
step 3 : ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి... అక్కడ ఈ ఇన్వైట్ లింక్ను పేస్ట్ చేయాలి.
step 4 : ఆ వాట్సాప్ గ్రూపులో ఉన్న సభ్యులు ఆ లింకుపై క్లిక్ చేస్తే ఆటోమేటిగ్గా సిగ్నల్ యాప్ గ్రూపులోకి షిఫ్ట్ అవుతారు.
ఇదే తరహాలో టెలీగ్రామ్ మెసేంజర్ యాప్లోనూ గ్రూప్స్ క్రియేట్ చేయవచ్చు. వాట్సాప్ నుంచి తప్పుకుంటున్న చాలామంది సిగ్నల్,టెలీగ్రామ్ వైపే మొగ్గుచూపుతున్నారు. ఎలన్ మస్క్ ఇప్పటికే సిగ్నల్ యాప్లో చేరడమే కాదు.. తన ట్విట్టర్ ఫాలోవర్లకు 'సిగ్నల్' యాప్ వాడాలని సూచించాడు.దీంతో ఒక్కసారిగా సిగ్నల్ యాప్కు రిజిస్ట్రేషన్లు పెరిగాయి.వాట్సాప్ తరహాలోనే సిగ్నల్ యాప్ కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రొటోకాల్తో పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్ను సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, ప్రైవసీ రీసెర్చర్స్, విద్యావేత్తలు, జర్నలిస్టులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
కాగా,వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ఫిబ్రవరి 8 నుంచి అమలులోకి రానున్న సంగతి తెలిసిందే. ఆలోపు కొత్త ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయని యూజర్ల వాట్సాప్ ఖాతా తొలగించబడుతుంది. ఈ కొత్త పాలసీ అమలుతో యూజర్కి సంబంధించిన సమాచారం వాట్సాప్ ఫేస్బుక్తో షేర్ చేసుకోనుంది. ఈ నిర్ణయంపై యూజర్లు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.