షింజో అబేను కదిలించిన ఘటన: ఢిల్లీ పోలీసుకు సంతాపం
న్యూఢిల్లీ: జపాన్ ప్రధాని షింజో అబే గత వారంలో మూడు రోజుల పర్యనటలో భాగంగా భారత్కు వచ్చి, బుల్లెట్ రైలు, అణు ఒప్పందం లాంటి కీలక ఒప్పందాలు కుదుర్చుకుని తిరిగి జపాన్కు వెళ్లారు. అక్కడి వెళ్లిన తర్వాత తన పర్యనటలో జరిగిన ఓ ఘటన ఆయన్ను ఎంతగానో కదిలించివేసింది.
షింజో అబే భారత పర్యనటలో భాగంగా తన కాన్వాయ్లో, తనకు రక్షణగా ప్రయాణిస్తున్న ఓ భారత కానిస్టేబుల్ చనిపోయాడని తెలుసుకున్న ఆయన అతడి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని తెలిపారు. వివరాళ్లోకి వెళితే, ఈ నెల 13న ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో అబే ప్రయాణిస్తున్న కాన్వాయ్లో బైక్ నడుపుతున్న వీరేందర్ సింగ్ యాదవ్ అనే హెడ్ కానిస్టేబుల్ గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో మరణించాడు.
ఈ ఘటన ఆరోజు షింజోకు తెలియలేదు. తిరిగి జపాన్ వెళ్లిన తర్వాత విషయాన్ని తెలుసుకున్న అబే, వీరేందర్ కుటుంబానికి ఓ పూల బొకేతో పాటు తన ప్రగాడ సానుభూతిని తెలియజేస్తూ లెటర్ను పంపించారు. దీన్ని భారత్లోని జపాన్ రాయబార కార్యాలయ అధికారులు వీరేందర్ కుటుంబ సభ్యులకు అందించారు.
పాలెం పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న వీరేందర్ కు గత ఆదివారం నాడు షింజో కాన్వాయ్ డ్యూటీ పడింది. తెల్లవారుఝామున 3 గంటల సమయంలో ఆయన కాన్వాయ్ ముందు బైక్పై వెళుతున్న వీరేందర్ను మెట్రో పిల్లర్ 139 వద్ద ఓ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఆయన అక్కడిక్కడే మరణించారు. కాన్వాయ్ ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలూ కలుగనీయకుండా చర్యలు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న షింజోకు పై విధంగా స్పందించారు.