షిర్డీ సాయిబాబా దేవుడు కాడు: ధర్మసంసద్ ప్రకటన
రాయ్పూర్ : షిరిడీ సాయి బాబా దేవుడు కాదని చత్తీస్గఢ్లోని కబీర్ధామ్ జిల్లాలో ముగిసిన ధర్మ సంసద్ తీర్మానించింది. సనాతన ధర్మాన్ని పాటించే వారెవరూ ఆయన్ని దేవుడిగా ఆరాధించ వద్దని కోరింది. కాశీ విద్వత్ పరిషత్ కూడా సాయి బాబా దేవుడూ కాదు, గురువూ కాదని తీర్మానించిన విషయాన్ని గుర్తు చేసింది.
మాంసాహారం తిన్న సాయిబాబా సన్యాసి కూడా కాదని, హిందువులెవరూ ఆయన్ని ఆరాధించ వద్దని ద్వారకా శంకరాచార్య ఇంతకు ముందే ప్రకటించారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో చత్తీస్గఢ్లో ఈ ధర్మ సంసద్ జరిగింది. హిందూమతానికి చెందిన 13 అఖారాల ప్రతినిధులు, అనేక మంది మత ప్రముఖులు రెండు రోజుల పాటు జరిగిన ఈ రహస్య చర్చా సదస్సుకు హాజరయ్యారు.
మహారాష్ట్రలోని షిరిడీ సాయి సంస్థాన్కు కూడా ఆహ్వానం పంపినా ఎవరూ రాలేదు. అయితే ఢిల్లీ, అహ్మదాబాద్ నుంచి వచ్చిన కొంత మంది సాయి భక్తులు తమ వాదన వినిపిస్తుండగా ఒక సాధువు వారిని అడ్డుకుని బయటికి వెళ్లాలని కోరారు.
దీంతో ఇద్దరి మధ్య వాదనలు చోటు చేసుకోవడంతో వేదికపై ఉన్న వారు కల్పించుకుని సర్ది చెప్పడంతో వివాదం ముగిసింది. అయోధ్యలో రామమందిర నిర్మాణంతో పాటు గో సంరక్షణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ధర్మ సంసద్ తీర్మానించింది.