షిర్డీ ఆలయ ట్రస్టులో ఆర్థిక సంక్షోభం: జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి
షిర్డీ: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. అనేక వ్యాపార సంస్థలు, పరిశ్రమలు కూడా తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయాయి. భక్తులు రాకపోవడంతో దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు కూడా భారీగా ఆదాయం తగ్గిపోయింది.
యేటా రూ. 400 కోట్లు..
ప్రతియేటా రూ. 400 కోట్ల ఆదాయం పొందే షిర్డీ ఆలయ ట్రస్టు కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఆ ఆలయ ట్రస్ట్ తన ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిని ఎదుర్కొంటోంది. గత మూడు నెలలుగా లాక్ డౌన్ పరిస్థితులు నెలకొనడంతో భక్తులెవరూ ఆలయానికి రావడం లేదు.
విరాళాలూ అందకపోవడంతో..
ఇక విరాళాలు కూడా అందడం లేదు. దీంతో రోజుకు రూ. 1.5 కోట్ల మేర నష్టం వస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ వర్గాలు చెబుతున్నాయి. తిరుమల తిరుపతి శ్రీవారి క్షేత్రం తర్వాత అంతటి సంపన్న ఆలయంగా పేరుగాంచిన షిర్డీ ఆలయం ఇప్పుడు నిర్వహణ ఖర్చులు కూడా చెల్లించలేని పరిస్థితికి చేరింది.
జీతాలు వస్తాయా? రావా?
షిర్డీ ఆలయ ఉద్యోగులకు ప్రతి నెల 5వ తేదీన జీతాలు చెల్లిస్తారు. కానీ, ఈసారి 20న తేదీ వచ్చినా వేతనాలు అందక ఉద్యోగులు వేతనాలు అందక తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు. సాధారణంగా వచ్చే విరాళాలను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. లాక్ డౌన్ ప్రభావంతో ఆలయానికి ఆర్జన తగ్గడంతో ఫిక్స్ డ్ డిపాజిట్ల నుంచే జీతాలు చెల్లించినా, మే నెలకు వచ్చే సరికి ఖాతాల ఖాళీ అయ్యాయి. దీంతో తమ జీతాల గురించి అడిగితే ఆలయ స్పందించడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కాగా, షిర్డీలోని సాయిబాబా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఉద్యోగుల జీతాల్లోనూ కోత విధించారు. డాక్టర్లకు ఇచ్చే ప్రోత్సహకాలను నిలిపివేసిన షిర్డి ట్రస్ట్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాల్లో 40 శాతం కోత విధించింది. దీంతో భక్తులు ఆలయానికి రావడం ప్రారంభమైతేనే తమ కష్టాలు తీరుతాయంటూ ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి.