బోగీలను వదిలిపోయిన శివగంగా ఎక్స్ప్రెస్ ఇంజిన్
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి మరువాడీకి వెళుతున్న శివగంగా ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్.. దానికి చెందిన బోగీల నుంచి విడిపోయి కొంత దూరం వరకు వెళ్లిపోయింది. దీంతో 6కుపైగా రైళ్లను నిలిపివేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ ఘటన జంగీగంజ్, అత్రౌలా రైల్వే స్టేషన్ల మధ్య చోటు చేసుకుంది.
సోమవారం ఉదయం 9:10 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగిందని గ్యాన్పూర్ స్టేషన్ మాస్టర్ అశోక్ కుమార్ వర్మ తెలిపారు. రైలు తక్కువ వేగంతో ఉన్నప్పుడు బోగీల నుంచి ఇంజను విడివడిందని చెప్పారు.
దీంతో ప్రమాదం తప్పిందని లేదంటే పెద్ద ప్రమాదం జరిగేదన్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో ఆ మార్గంలో నడవాల్సిన అరడజను రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు.
ఆ తర్వాత మరో ఇంజన్ని తెప్పించి బోగీలకు కలిపి 10:34 నిమిషాలకు రైలును అక్కడి నుంచి గమ్యస్థానానికి పంపించినట్లు అశోక్ కుమార్ వర్మ చెప్పారు.