అవిశ్వాసం తీర్మానంపై చర్చకు శివసేన దూరం: బీజేపీకి సానుకూలమే!
న్యూఢిల్లీ: ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న శివసేన ఎట్టకేలకు తన నిర్ణయాన్ని తెలియజేసింది. తాము ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తారనుకున్న టీడీపీ ఆశలపై నీళ్లు చల్లింది. నిన్నటి వరకు ఎన్డీఏకు మద్దతిస్తామని, ఆ తర్వాత తమ నిర్ణయం మార్చుకున్నామని చెప్పిన శివసేన.. శుక్రవారం ఉదయం తాజాగా కీలక ప్రకటన చేసింది.
లోక్సభలో శుక్రవారం జరిగే అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొనబోమని స్పష్టం చేసింది. దీంతో లోకసభలో మ్యాజిక్ ఫిగర్కు 18 సీట్లు తగ్గనున్నాయి. ఇది ఓ రకంగా బీజేపీకి సానుకూల నిర్ణయంగానే చెప్పుకోవచ్చు.
ఇది ఇలా ఉంటే, బీజేడీ సభ్యులు శుక్రవారం ఉదయం పార్లమెంటు ఉభయసభలు ప్రారంభం కాగానే వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఇక, టీఆర్ఎస్ సభ్యులు కూడా టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా లేదు. చర్చలో పాల్గొని తెలంగాణకు సంబంధించిన అంశాలను ప్రస్తావించి ఆ తర్వాత సభ నుంచి వెళ్లిపోవాలని భావిస్తున్నట్లు తెలిసింది.