కన్నడ మంట: శివసేన ఉగ్రరూపం.. బీజేపీ సీఎం దిష్టిబొమ్మ దగ్ధం: సినిమాల ప్రదర్శన నిలిపివేత..!
బెంగళూరు: మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం మళ్లీ రాజుకుంది. మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప దిష్ఠిబొమ్మను దగ్ధం చేసే స్థితికి చేరుకుంది. కన్నడ భాషా చలన చిత్రాల ప్రదర్శనను నిలిపివేసేంతలా పరిణమించింది. ఫలితంగా- మహారాష్ట్రలో ఆధ్యాత్మిక నగరి కొల్హాపూర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు.
ఏమిటీ సరిహద్దు వివాదం..?
మహారాష్ట్ర, కర్ణాటక మధ్య బెళగావి జిల్లా కేంద్రంగా దశాబ్దాల కాలం నుంచీ సరిహద్దు వివాదం నడుస్తోంది. బెళగావి జిల్లా మొత్తాన్నీ మహారాష్ట్రలో కలపాలనేది ప్రధాన డిమాండ్. మహారాష్ట్ర సరిహద్దులకు ఆనుకుని ఉండే ఈ జిల్లాలో కన్నడ కంటే కూడా మరాఠీని మాట్లాడేవారి సంఖ్యే అధికం. బెళగావి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మరాఠీ సంస్కృతి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. ఈ జిల్లాను మహారాష్ట్రలో కలపాలనే డిమాండ్ ఈ నాటిది కాదు. దీనిపై ఈ రెండు రాష్ట్రాల మధ్య చాలాకాలం నుంచే వివాదం నడుస్తోంది.
మళ్లీ రగులుకున్న వేడి..
బెళగావి జిల్లాను మహారాష్ట్రలో విలీనం చేయాలనే డిమాండ్ మరోసారి ఊపందుకుంది. కొద్దిరోజుల కిందటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్వయంగా.. ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. బెళగావి జిల్లా ఇదివరకు మహారాష్ట్రలోనే ఉండేదని, రాష్ట్రాల పునర్విభజన సందర్భంగా ఆ ప్రాంతం కర్ణాటకలో విలీనమైందని చెప్పుకొచ్చారు. తాము కోల్పోయిన తమ ప్రాంతాన్ని మళ్లీ సాధించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యలకు నిరసనగా శనివారం కన్నడ భాషా సంఘాలు ఉద్యమించాయి. బెళగావిలో ఉద్ధవ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి.
చెలరేగిన శివసేన..
ఉద్ధవ్ థాకరే మాటల ప్రభావమో, ఏమో తెలియట్లేదు గానీ.. శివసేన నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఒక్కసారిగా చెలరేగిపోయారు. కొల్హాపూర్ ను కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను చేపట్టారు. మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి ప్రతినిధులు వారికి మద్దతు ఇచ్చారు. బెళగావి జిల్లాను మహారాష్ట్రలో విలీనం చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
బస్సు సర్వీసుల నిలిపివేత..
కొల్హాపూర్ లో ప్రదర్శితమౌతోన్న కన్నడ చలనచిత్రాల ప్రదర్శనను నిలిపివేశారు. ఆయా సినిమాల పోస్టర్లు, హోర్డింగులను చింపి పడేశారు. కొల్హాపూర్ నుంచి బెళగావికి అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితులు అదుపులోకి వచ్చిన తరువాతే బస్సులను నడిపిస్తామని రెండు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థ అధికారులు వెల్లడించారు. దీనికంతటికీ కన్నడ భాషా సంఘాలే కారణమని శివసేన నాయకులు ఆరోపిస్తున్నారు. బెళగావిని మహారాష్ట్రలో విలీనం చేయాలంటూ ఉద్ధవ్ థాకరే చేసిన ప్రకటనలో ఎలాంటి తప్పూ లేదని వారు స్పష్టం చేస్తున్నారు.