రాజ్యసభ డిప్యూటీ చైర్మన్: ఎన్డీయే అభ్యర్థికే శివసేన మద్దతు, బీజేపీకి ఊరట
ముంబై: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో శివసేన ఎన్డీయే అభ్యర్థికి మద్దతివ్వాలని నిర్ణయించింది. ఎన్డీయే అభ్యర్థిగా జేడీయూ రాజ్యసభ సభ్యుడు హరివంశ్ నారాయణ్ సింగ్ బరిలో నిలిచారు. ఆగస్ట్ 9వ తేదీన ఎన్నికలు ఉన్నాయి. దీనిపై శివసేన ఎంపీ అనిల్ దేశాయి మాట్లాడుతూ.. ఎన్డీయే అభ్యర్థికి తాము మద్దతిస్తున్నామని చెప్పారు.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక: టీడీపీ ఊహించని నిర్ణయం, కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు
నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత నెలలో విపక్షం లోకసభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్కు శివసేన దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా బీజేపీపై సందర్భం వచ్చినప్పుడల్లా శివసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతిస్తామని ప్రకటించడం గమనార్హం.
మరోవైపు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ విపక్ష అభ్యర్ధిగా కాంగ్రెస్కు చెందిన బీకే హరిప్రసాద్ రంగంలో నిలిచారు. వీరిరువురూ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలతో ఎన్డీఏ సంప్రదింపులు చేస్తోంది.